Chandrababu: కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్ దారులు చనిపోయారని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత లేఖలో కోరారు.
లేఖలోని అంశాలు:-
• ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవడం ద్వారా లబ్ధిదారులకు పథకాలు అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు.
• కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు విరుద్ధంగా పెన్షన్ల పంపిణీ గ్రామ సచివాలయాల వద్ద చేపట్టాలని సెర్ప్ సీఈవో ఉత్తర్వులు ఇచ్చారు.
• దీని వల్ల తలెత్తే ఇబ్బందులను తెలుపుతూ ఇంటింటికీ పెన్షన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరాను.
• గ్రామ/వార్డు సచివాలయాల్లో 1,34,694 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్న దృష్ట్యా వారి ద్వారా ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయవచ్చు.
• అయితే టీడీపీని దోషిగా చేసి రాజకీయంగా లబ్ది పొందేందుకు పెన్షనర్లను 40 డిగ్రీల ఎండలో వృద్ధులు, వికలాంగులను సచివాలయాలకు పిలిపించారు.
• సచివాలయాల వద్ద షామియానాలు, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించలేదు.
• సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీకి వచ్చే లబ్దిదారుల కోసం ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సర్క్యులర్ ఇచ్చినప్పటికీ సచివాలయాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం అయ్యారు.
• దీని ఫలితంగా దాదాపు 60 లక్షల మంది పింఛనుదారులు తీవ్రమైన ఎండలో సచివాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడ్డారు.
• సచివాలయాల వద్ద నగదు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది పింఛను పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చారు.
• ఈ క్రమంలోనే 33 మంది పింఛనుదారులు వడదెబ్బకు గురై మరణించారు.
• ఇంటికి వెళ్లి పెన్షన్ అందించి ఉంటే 33 మంది వృద్ధుల ప్రాణాలు పోయేవి కావు
• ఆనారోగ్యంతో ఉన్న వారికి ఇంటివద్దకు వెళ్లి పెన్షన్ ఇవ్వాలని సూచనలు ఉన్నప్పటికీ….ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. ఇదంతా కుట్రపూరితంగానే జరిగింది.
• పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
• పింఛనుదారులకు సకాలంలో నిధులు, సరైన సౌకర్యాలు అందించనందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి.
• ఇక నుంచి గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛను అందించేలా ఆదేశాలు ఇవ్వండి.
• తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించి, 33 మంది మరణానికి కారణమైన అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలి.
• పెన్షన్ల పంపిణీ విషయంలో తెలుగుదేశం పార్టీపై వైసీపీ చేసిన విష ప్రచారంపైనా చర్యలు తీసుకోండి.