చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలతపై పోలీసు వాహనం ఎక్కించిన ఘటనపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసు విచారణలో జాప్యం చేయకుండా.. నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు 22వ తేదీన అధికారులను కోరారని, స్థానిక పోలీసులు బాధితుల వినతిపై చర్యలు తీసుకోకుండా సాక్షులను బెరిదించేలా వ్యవహరించారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. కీలక సాక్షి అయిన సతీష్ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని వేధించారని, ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంటిపై దాడి చేశారన్నారు.
పోలీసులే తమతో పచ్చిగడ్డి తెచ్చి పూర్ణ ఇంట్లో గంజాయి ఉందంటూ అరెస్టు చేశారని, అడ్డుకున్న మాజీ మేయర్ హేమలతపై దారుణంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. పోలీసు చర్యలను నిరసించిన హేమలతపై పోలీసు జీపు ఎక్కించడంతో ఆమె తీవ్ర గాయంతో ఆసుపత్రి పాలయ్యిందన్నారు. అక్రమాన్ని నిరసించిన హేమలతను గాయపరిచిందే కాకుండా.. పోలీసు జీపు డ్రైవరుపై దాడి జరిగిందని అతన్ని అసుపత్రిలో చేర్చారన్నారు.
పూర్ణపై అక్రమ కేసు పెట్టి, హేమలతపై దారుణంగా వ్యవహరించిన పోలీసుపై చర్యలు తీసుకోవాలని, వైసీపీ నేతల కోసం సాక్షులను బెదిరిస్తున్న స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. పోలీసుపై ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారుల తక్షణ చర్యలు ఉండాలన్నారు.