Supreme Court: చండీగఢ్ మేయర్ ఫలితంపై సంచలన తీర్పు.. ఆప్ సంబరాలు

Supem

Supem

చండీగఢ్ మేయర్ ఎన్నికపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమారే మేయర్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఆప్‌ను విజేతగా ప్రకటిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు ప్రకటించింది. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సుప్రీంకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

మేయర్ ఎన్నిక (Chandigarh Mayoral Polls) సందర్భంగా బ్యాలెట్ పత్రాలను తారుమారు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ తీరుపై మండిపడింది. అంతేకాదు ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తారా? అంటూ గతంలోనే ధ్వజమెత్తింది. తాజాగా మంగళవారం కూడా రిటర్నింగ్ అధికారి తీరుపై సుప్రీం (Supreme Court) మండిపడింది.

సోమవారం చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన అక్రమాలపై వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. మంగళవారం బ్యాలెట్ పత్రాలతో హాజరుకావాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశించింది. ఈరోజు విచారణ చేపట్టిన కోర్టు… చెల్లని 8 ఓట్లను న్యాయమూర్తులు పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగానే 8 ఓట్లను అధికారి అడ్డగీతలు గీశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారి తీరును తీవ్రంగా తప్పుపట్టి మందలించింది. అనంతరం ఆప్ అభ్యర్థిని విజేతగా ధర్మాసనం ప్రకటించింది.

ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు విచారణకు ముందే చండీగఢ్ బీజేపీ మేయర్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లను బీజేపీలో చేర్చుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆప్, కాంగ్రెస్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు.