NTV Telugu Site icon

Cab Driver Stabbed: ఓవర్‌టేక్‌ చేయడానికి దారి ఇవ్వలేదని.. క్యాబ్‌ డ్రైవర్‌ను కత్తితో పొడిచి హత్య

Delhi

Delhi

Cab Driver Stabbed: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓవర్‌టేక్‌ చేసేందుకు బైక్‌కు దారివ్వలేదన్న కోపంతో క్యాబ్‌ డ్రైవర్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఓవర్‌టేక్ చేసే విషయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు క్యాబ్‌ డ్రైవర్‌తో గొడవపడ్డారు. అనంతరం ఆగ్రహంతో క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో పొడిచి చంపారు. ఈ కేసుకు సంబంధించి మైనర్‌ను పోలీసులు పట్టుకోగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

Read Also: Vijay: షాకింగ్.. విజయ్ పైకి చెప్పు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి.. వీడియో వైరల్

సంగం విహార్‌కు చెందిన మనోజ్ కుమార్ గురుగ్రామ్‌లోని ఓ కంపెనీలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రం అతను మాల్వియా నగర్ నుంచి ఐదుగురు ఉద్యోగులను తీసుకొని మరొక ఉద్యోగిని పికప్ చేసుకోవడానికి మెహ్రౌలీకి వెళ్తుండగా, అతని క్యాబ్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. రాత్రి 8.40 గంటల ప్రాంతంలో ముగ్గురు నిందితులు బైక్‌పై వచ్చి దారి ఇవ్వాలని మనోజ్‌ను కోరగా, స్థలం లేకపోవడంతో కుదరలేదు. దీంతో వారి మధ్య గొడవ జరిగి వారిలో ఒకరు కత్తితో మనోజ్ ఛాతిపై పొడిచాడు.

Read Also: Akhu Chingangbam Kidnap: మణిపూర్ గాయకుడు-గీత రచయిత అఖు చింగాంగ్‌బామ్‌ కిడ్నాప్

అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలో స్థానికులు మనోజ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల్లో ఒకరైన మైనర్‌ని గుర్తించి పట్టుకున్నారు. ప్రస్తుతం మిగిలిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.