Blast near Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు సంభవించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో ‘పేలుడు’ సంభవించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్కు కాల్ వచ్చింది. మంగళవారం సాయంత్రం కాన్సులేట్ భవనం సమీపంలో పేలుడు జరిగినట్లు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ధృవీకరించింది. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఇజ్రాయెల్ జెండాతో చుట్టబడిన లేఖ కూడా లభ్యమైందని తెలిసింది. ఈ లేఖ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన రాయబారిని ఉద్దేశించి పంపినట్లు ఆ వర్గాలు తెలిపాయి. “సాయంత్రం 5:08 (సాయంత్రం) సమయంలో రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించిందని మేము నిర్ధారించగలము. ఢిల్లీ పోలీసులు, భద్రతా బృందం పరిస్థితిని ఇంకా దర్యాప్తు చేస్తున్నారు” అని రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
Read Also: Russia-Ukraine War: మరోసారి రష్యాపై దాడి చేసిన ఉక్రెయిన్.. ఒకరు మృతి
దేశ రాజధానిలోని దౌత్యపరమైన ప్రాంతం అయిన చాణక్యపురి ప్రాంతంలో ఉన్న రాయబార కార్యాలయం వెనుక జరిగిన పేలుడుపై ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఢిల్లీ ఫైర్ సర్వీస్కు గుర్తు తెలియని కాల్ చేసి పేలుడు సంభవించిందని తెలిపాడు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో పేలుడు సంభవించిందని కాలర్ పేర్కొన్నాడు. అనంతరం బాంబ్ స్క్వాడ్తో పాటు పోలీసు ప్రత్యేక సెల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ ప్రదేశంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ చెప్పారు.”సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇది జరిగింది, నేను నా డ్యూటీలో ఉండగా పెద్ద శబ్దం వినిపించింది. బయటికి వచ్చేసరికి చెట్టు పైనుంచి పొగలు కమ్ముకోవడం చూశాను, అంతే… పోలీసులు నా స్టేట్మెంట్ తీసుకున్నారు…” అని ఓ సాక్షి తెలిపారు. సమగ్ర విచారణ జరుగుతోంది. లేఖను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.