Site icon NTV Telugu

Hyderabad: తెలంగాణ బడ్జెట్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు

Bjp

Bjp

తెలంగాణ ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) చాలా తెలివిగా వ్యవహరిస్తు్న్నారని.. అందుకే బడ్జెట్‌ను కూడా చాలా తెలివిగా ప్రవేశపెట్టారని బీజేపీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడారు. అమలుకు నోచుకొలేని హామీలిచ్చారని భట్టికి కూడా తెలుసు అని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు రాష్ట్ర బడ్జెట్ కాదు కదా.. దేశ బడ్జెట్ కూడా సరిపోదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హామీలు నెరవేరాలంటే ఏడాదికి లక్ష యాభై వేల కోట్లు కావాలన్నారు. ఏటా మహాలక్ష్మి పథకానికి 17 వేల కోట్లు కావాలని.. కానీ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎక్కువగా ఉన్నాయని.. బడ్జెట్లో కేటాయించిన నిధులు మాత్రం నిల్‌గా ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టే ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని..
ఆవాస్ యోజన కింద నిర్మించే ఇళ్లకు ఇందిరమ్మ పేరే కాకుండా వాజ్‌పేయ్ పేరు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రజలకు చెప్పాలని కోరారు. ఆర్థికంగా రాష్ట్రo నిర్వీర్యం అయ్యిందని చెబుతున్నారు.. మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు నిధులను ఎక్కడి నుంచి సమకూరుస్తారో చెప్పాలని నిలదీశారు. మీరు కూడా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తారా…? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

Exit mobile version