మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఏక్నాథ్శిబిరానికి చేరుకుంటున్న తరుణంలో సీఎం ఉద్ధవ్ థాక్రే కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సాంకేతాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. మరోపక్క శివసేన కీలకనేత సంజయ్రౌత్ మహా ప్రభుత్వంకు ఎలాంటి ఢోకా లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర సంక్షోభంపై బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ విజయశాంతి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్ధాంతాలను వదిలి, అధికారం కోసం అర్రులు చాస్తే అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతుందని, శివసేనలో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆమె అన్నారు.
‘మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేన పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు పరిణామం ఎంతమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు. సీఎం ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేనలో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతోంది. సిద్ధాంతాలని బలిపెట్టి, అధికారం కోసం అర్రులు చాస్తే అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగులుతుందని ఈ సంక్షోభం రుజువు చేసింది. లోక కల్యాణానికి మూలమైన హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని ఉద్ధవ్ తండ్రి బాల్ థాకరే శివసేన పార్టీ స్థాపించారు. పొత్తులు,సంకీర్ణ సర్కార్లపై ఆయన గతంలో స్పందిస్తూ ఏ పార్టీకి మెజారిటీ ఉందో ఆ పార్టీ మాత్రమే సంకీర్ణ సర్కారుకు నేతృత్వం వహించాలని కూడా స్పష్టంగా చెప్పారు. ఉద్ధవ్ ఇవన్నీ తుంగలో తొక్కి, కేవలం అధికారం కోసం తండ్రి వ్యతిరేకించిన పార్టీలతోనే చేతులు కలిపి శివసేనని మలినం చేశారు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి ఉండటం ఎంత ప్రమాదకరమో చివరికి ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు గ్రహించినా ఉద్ధవ్ మేలుకోకపోవడం ఈ పరిస్థితులకి దారితీసిందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ‘చిరకాల మిత్రుడిగా ఉంటూ వచ్చిన బీజేపీని దూరం చేసుకున్నారు. చివరికిప్పుడు సొంత పార్టీవారే తిరుగుబాటు చెయ్యగా… దిక్కులేక సీఎం పీఠాన్ని వదులుకునేందుకు సిద్ధపడాల్సి వచ్చింది. ఉద్ధవ్కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు’ అంటూ విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.