BJP: తెలంగాణలో బీజేపీ నేతల మధ్య గొడవలను సమసిపోయేలా చేసేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అధికారమే లక్ష్యమంటున్న బీజేపీ హైకమాండ్..రాష్ట్ర పార్టీ నేతలంతా కలసికట్టుగా పనిచేసేలా చూడడంపై దృష్టి కేంద్రీకరించింది. కీలక నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెరుగుతుందని, తద్వారా ఎన్నికల్లో దూసుకుపోవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సీరియస్గా కసరత్తు చేస్తోంది హైకమాండ్. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై కొంతకాలంగా కొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న నేతలకు, కొత్తగా చేరిన నేతలకు మధ్య గ్యాప్ పెరిగడంతో ఈ అంతరాన్ని తగ్గించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
బండి సంజయ్ను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే ఆ స్థానంలోకి ఎవరు వస్తారు..అంటే…ప్రధానంగా వినిపిస్తున్న పేరు డీకే అరుణ. ఒక వేళ బండి సంజయ్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానే కొనసాగిస్తే… డీకే అరుణకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఈటల రాజేందర్కు కూడా కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేరికల కమిటీ ఛైర్మన్గా ఉన్న ఈటల రాజేందర్కు బీజేపీ రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా సునీల్ బన్సల్ ఒక్కరే ఉంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. కీలకమైన ఈ మార్పుచేర్పులన్నీ నాలుగైదు రోజుల్లోనే జరగనున్నట్లు కమలనాథుల నోట ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15న ఖమ్మంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఖమ్మంలో అమిత్ షా భారీ బహిరంగసభకు ముందుగానే ఈ మార్పులు చేస్తారని తెలుస్తోంది.
తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్పుచేర్పులపై బీజేపీ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ నాయకత్వాల్లోనే కాదు, కేంద్ర కేబినెట్లోనూ మార్పు చేర్పులుంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా అటు కేంద్ర కేబినెట్లో కానీ, ఇటు తెలంగాణ బీజేపీ నాయకత్వంలో కానీ సామాజిక వర్గాల సమీకరణలను పరిగణలోకి తీసుకుని మార్పులు జరగనున్నాయి.