కోల్కతా ఎయిర్పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఒకే రన్ వేపైకి రెండు విమానాలు రావడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో విమాన రెక్కలు విరిగిపడ్డాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
ఒక విమానం చెన్నైకి వెళ్తుంటే.. మరొక విమానం దర్భంగాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా డీజీసీఏ పేర్కొంది. ఒకే రన్ వేపైకి వచ్చి ఢీకొట్టుకోవడంతో విమానాల రెక్కలు విరిగిపోయాయని తెలిపింది. ఇక ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.

బుధవారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఎయిరిండియా విమానం చెన్నైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. విమానంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు 163 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో విమానం ఇండిగోకు చెందింది కాగా.. కోల్కతా నుంచి దర్భంగాకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ విమానంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు 149 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రెండు విమానాలు ఒకేసారి రన్వేపైకి వచ్చేశాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని డీజీసీఏ వెల్లడించింది. విచారణ సమయంలో సిబ్బందిని కూడా విచారిస్తామని తెలిపింది. ఈ ఘటన తర్వాత పైలట్లను విధుల నుంచి తొలగించాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమాన రెక్కలు రన్వేపై పడి ఉన్నాయి.
