చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు చేదు అనుభవం తగిలింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంపై నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో.. గో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య అని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, పార్టీ కార్యకర్తలతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని అంటున్నారు. ఇంతకుముందు.. యాదయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించాడని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అని చెప్పిన ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ లో చేరడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు.
Read Also: Kalki 2898 AD – Nagarjuna : నాగి వేరే లోకానికి తీసుకెళ్లాడు.. కల్కి పై నాగార్జున కామెంట్స్ వైరల్..
ఎమ్మెల్యే కాలే యాదయ్య.. నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. ఈ రోజు సాయంత్రం 7:00 గంటలకు ఎమ్మెల్యే కాలే యాదయ్య రానున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని సాయంత్రం ఏడు గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగనున్నారు. అనంతరం.. నియోజకవర్గ పర్యటనకు వెళ్లనున్నారు.
Read Also: Amarnath Yatra: ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర.. బయల్దేరిన యాత్రికులు