Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల వ్యవహారంపై హాట్ టాపిక్గా మారింది.. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలపై సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు కౌంటర్ ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన.. 2023లో అప్పటి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. గతంలో వైఎస్సార్ హయాంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిద్ధమైనా కోర్టు వ్యాజ్యాలతో ప్రక్రియ ఆగిపోయిందని.. జగన్ సీఎం అయ్యాక మళ్లీ ప్రక్రియ పూర్తి చేశామన్నారు.. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం 1200 ఎకరాల స్థలాన్ని యుద్ధప్రాతిపదికన ఇచ్చామని 17 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారా అని ప్రశ్నించారు..
ఇక, శాశ్వత ఉద్యోగాలు అవసరం లేదన్న చంద్రబాబు వ్యాఖ్యలపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీకు మాత్రం శాశ్వతంగా సీఎం పదవి కావాలి.. నిరుద్యోగులకు శాశ్వత ఉద్యోగాలు అవసరం లేదా అని నిలదీశారు.. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అయిన వెంటనే ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.. స్థానికులకు 75 శాతం రిజర్వేషన్తో పూర్తి ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు భూమన.. మొత్తంగా.. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల అంశంపై ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో టీటీడీ అధికారిక రికార్డుల్లో గతంలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగినట్లు నమోదై ఉంది.

