BWSSB To Supply Treated Water To IPL 2024 Matches in Chinnaswamy Stadium: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరాన్ని నీటి కష్టాలు చుట్టిముట్టిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోయి.. దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. త్రాగు నీటి కోసం కూడా క్యూ లైన్లో గంటల కొద్ది నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బెంగళూరులో ఐపీఎల్ 2024 మ్యాచ్లకు నీటి కష్టాలు తప్పడం లేదు.
బెంగళూరు నగరంలోని ప్రజల అవసరాలకే నీరు లభించని వేళ.. ఐపీఎల్ 2024లో భాగంగా నిర్వహించే ఒక్కో మ్యాచ్కు 75,000 లీటర్ల నీటి అవసరం ఉంది. నీటి కోసం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ చేసిన విన్నపంపై బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (బీడబ్ల్యూఎస్ఎస్బీ) కీలక నిర్ణయం తీసుకొంది. వేస్ట్ వాటర్ను శుద్ధి చేసి.. చిన్నస్వామి స్టేడియంకు సరఫరా చేయాలని బీడబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు నిర్ణయించారు. ఈ నీటిని కబ్బన్ పార్క్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి తీసుకోనున్నారు.
Also Read: IPL 2024: ముంబై ఇండియన్స్ ఎంత కసితో ఉందో అర్థమవుతోంది: అశ్విన్
బీడబ్ల్యూఎస్ఎస్బీ ఛైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ మాట్లాడుతూ… ‘ఐపీఎల్ 2024 మ్యాచ్లకు శుద్ధి చేసిన నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నాం. కావేరీ నది, భూగర్భ జలాలను అస్సలు వాడటం లేదు’ అని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో రామ్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ ఏడాది వర్షాభావం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, నగరంలో భారీగా నిర్మాణాలు పెరగడంతో.. నీరు భూమిలోకి చేరే మార్గాలు తగ్గిపోయాయి. దాంతో బెంగళూరులో నీటి సమస్య పెరిగింది.