హైదరాబాద్లో చారిత్రక కట్టడం చార్మినార్ సాక్షిగా ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ నటి ప్రత్యూష పాల్ వేధింపులకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. చార్మినార్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉండగానే ఒక వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. బెంగాలీ నటి ప్రత్యూష పాల్ ఈ నెల 2వ తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. సాయంత్రం వేళ ఆమె చార్మినార్ను సందర్శించారు. చార్మినార్ పరిసరాల్లోని ఫుట్పాత్పై వస్తువులు చూస్తూ షాపింగ్ చేస్తున్న సమయంలో టోలిచౌక్కు చెందిన అబ్దుల్ వాజీద్ (40) అనే వ్యక్తి ఆమెను గమనించాడు.
రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో ఆమెను అనుసరిస్తూ, కుటుంబ సభ్యుల ముందే అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నటి, వెంటనే స్థానిక చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, నిందితుడిని అబ్దుల్ వాజీద్గా గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, విచారణ చేపట్టిన న్యాయమూర్తి అతడికి 7 రోజుల జైలు శిక్ష విధించారు. సెలబ్రిటీ అని కూడా చూడకుండా బహిరంగ ప్రదేశంలో వేధింపులకు పాల్పడిన నిందితుడిపై పోలీసులు వేగంగా స్పందించి శిక్ష పడేలా చేయడంపై నటి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. నగరానికి వచ్చే పర్యాటకులు, సామాన్య ప్రజానీకం ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.
