బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ది కాంగ్రెస్ పార్టీకి లేదని తేటతెల్లమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరింత అన్యాయం చేస్తోందని, ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమన్నారు. కాంగ్రెస్కు చిత్తశుద్ది ఉంటే బీసీ జాబితాలో నుండి ముస్లింలను తొలగించాల్సిందే అని, ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందే అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… ‘బీసీ జాబితాలో ముస్లింలను చేరిస్తే ఆమోదించే ప్రసక్తే లేదు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ఈ విషయం తెలిసి కూడా కేంద్రంపై నెట్టాలనుకోవడం మూర్ఖత్వం. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ది కాంగ్రెస్కు లేదని తేటతెల్లమైంది. బీసీల్లో ముస్లింలను చేర్చడంవల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా పోతాయి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరింత అన్యాయం చేస్తోంది. ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పడం తథ్యం. కాంగ్రెస్కు చిత్తశుద్ది ఉంటే బీసీ జాబితాలో నుండి ముస్లింలను తొలగించాల్సిందే. ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందే’ అని అన్నారు.
Also Read: RCB Captain: ఆర్సీబీకి కొత్త కెప్టెన్.. అస్సలు ఊహించలేరు!
‘ఇచ్చిన మాట తప్పుతూ బీసీలను నిండా ముంచుతున్న పార్టీ కాంగ్రెస్. బీసీలంతా కాంగ్రెస్ మోసాలను గుర్తించాలని కోరుతున్నా. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కాంగ్రెస్కు లేదు. మార్చిలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే తెలంగాణకు నష్టమని తెలీదా?. 15వ గ్రాంట్స్ కమిషన్ నిధులు ఆగిపోతాయని తెలిసి కూడా జాప్యం చేస్తారా?. ఇప్పటికే రెండు దఫాలుగా నిధులు రాలేదు. 73, 74వ రాజ్యాంగ సవరణలను ఉల్లంఘిస్తున్నారు. స్థానిక సంస్థలకు ఐదేళ్లకోసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం చెబుతోంది. మీరు ఆమోదించిన రాజ్యాంగాన్ని మీరే అవమానిస్తారా?. రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరగడం కాదు.. రాజ్యాంగాన్ని అమలయ్యేలా చూడాలి. సర్పంచ్ లేకుంటే గ్రామ సభలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు జరిగేదెలా?. గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నా పట్టించుకోరా?. ఓడిపోతామనే భయానికే స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.