Bandi Bhagirath: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. ఓ యువతిపై లైంగిక దాడి కేసులో అరెస్టై చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత కొన్ని రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న భగీరథ్ తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. గత నెలలో భగీరథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భగీరథ్ మే 17న ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. ఇక, నిందితుడిని పేట్బషీరాబాద్ పోలీసులు గతంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మేడ్చల్ మేజిస్ట్రేట్ అతడికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకుముందు రెండు గంటలకుపైగా సిట్ అధికారులు అతడిని విచారించారు. అప్పటి నుంచి నెల రోజులకు పైగా జైలు జీవితం గడిపిన భగీరథ్ తాజాగా బెయిల్పై బయటకు రానున్నాడు.

