NTV Telugu Site icon

Pune car crash: నిరసనలకు దిగొచ్చిన కోర్టు.. నిందితులకు బెయిల్ రద్దు

Ace

Ace

పూణెలో ఇద్దరు ఐటీ నిపుణుల మృతికి కారణమైన బాలుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేయడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మహారాష్ట్రలోనూ బాధిత కుటుంబాలు, ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తం చేయడంతో న్యాయస్థానం దిగొచ్చింది. దీంతో మైనర్ బాలుడికి మంజూరు చేసిన బెయిల్‌ను జువైనల్ జస్టిస్ బోర్డు రద్దు చేసింది. బాలనేరస్థుడిని జూన్ 5 వరకు రిమాండ్ హోమ్‌కు పంపింది. అతడిని వయోజనుడిగా విచారించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోలేదు.

ఆదివారం అర్ధరాత్రి పలువురు బాలురు బార్‌లో పీకలదాక మద్యం తాగి అనంతరం అత్యంత వేగంగా పోర్షే కారును నడపడంతో ఇద్దరు టెకీలు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం సంఘటనాస్థలికి పోలీసులు చేరుకుని నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ధర్మాసనం యాక్సిడెంట్‌కు కారణమైన బాలుడికి బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా రోడ్డుప్రమాదాలపై వ్యాసం రాసుకుని రమ్మని చెప్పింది. వ్యక్తిగత బాండ్, రవాణా కార్యాలయాన్ని సందర్శించి అన్ని నియమాలు, నిబంధనలు అధ్యయనం చేసి ప్రజెంటేషన్ ఇవ్వాలని తెలిపింది. మానసిక వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఈ తీర్పు దేశ వ్యాప్తంగా ఆగ్రహాన్ని తెప్పింది.

ఇది కూడా చదవండి: AAP: ఢిల్లీలో నీటి సంక్షోభానికి బీజేపీ కుట్ర

బాధిత కుటుంబాలు న్యాయస్థానం తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. అంతేకాకుండా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ కూడా ఈ తీర్పును తప్పుపట్టారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక సోషల్ మీడియా వేదికగా కోర్టుపై నెటిజన్లు మండిపడ్డారు. మొత్తానికి నిరసనలకు తలొగ్గి బెయిల్ రద్దు చేసింది.

12వ తరగతి ఫలితాల సందర్భంగా పూణెలోని రెండు పబ్బుల్లో స్నేహితులతో కలిసి మద్యం సేవించిన బాలుడు.. బైక్‌పై వెళ్తున్న 24 ఏళ్ల ఐటీ నిపుణులను కళ్యాణి నగర్ ప్రాంతంలోని 2.15 గంటల ప్రాంతంలో ఢీకొట్టాడు. బైక్ నడుపుతున్న అనీష్ అవధియా ఎగిరిపోయి ఆగి ఉన్న కారును ఢీకొట్టగా.. అశ్విని కోష్ట 20 అడుగుల ఎత్తులో గాలిలోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

ఇది కూడా చదవండి: Ebrahim Raisi: భారత్ తరుపున ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలకు హాజరైన ఉపరాష్ట్రపతి..