Ayatollah Ali Khamenei: మధ్యప్రాచ్య రాజకీయాలను నాలుగు దశాబ్దాల పాటు శాసించిన ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ (86) శకం ముగిసింది. శనివారం అర్ధరాత్రి అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ దాడిలో ఖమేనీ మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. 1989 నుంచి ఇరాన్ను తన గుప్పిట్లో ఉంచుకున్న ఖమేనీ మరణంతో ఆ దేశంలో ఒక యుగం అంతమైంది.
READ ALSO: Minab Airstrike: ఇరానియన్ బాలికల పాఠశాలపై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 85 మంది మృతి
నిఘా నీడలో ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’..
అమెరికా – ఇజ్రాయెల్ సైన్యాలు అత్యంత రహస్యంగా, కచ్చితత్వంతో ఈ భారీ వైమానిక దాడిని చేపట్టాయి. తేహ్రాన్లోని సుప్రీం లీడర్ నివాస సముదాయం, సైనిక స్థావరాలు, IRGC కమాండర్ల నివాసాలే లక్ష్యంగా ఈ రెండు దేశాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో ఖమేనీతో పాటు పలువురు కీలక ఐఆర్జీసీ (IRGC) కమాండర్లు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు అందుతున్నాయి. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “చరిత్రలోనే అత్యంత దుష్టులలో ఒకరైన ఖమేనీ అంతమయ్యాడు” అని ప్రకటించారు.
శహాదత్ ప్రకటించిన ఇరాన్ వర్గాలు..
ఖమేనీ మరణాన్ని (శహాదత్) ఇరాన్ స్టేట్ టెలివిజన్, తస్నీమ్ వార్తా సంస్థలు ధృవీకరించాయి. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, “ఖమేనీ మరణం ప్రపంచ దుర్మార్గులపై గొప్ప తిరుగుబాటుకు నాంది పలుకుతుంది” అని పేర్కొంది. సుప్రీం లీడర్ మృతితో ఇరాన్ దేశ వ్యాప్తంగా 40 రోజులు సంతాప దీనాలు ప్రకటించింది. తాజా దాడుల్లో సుప్రీం లీడర్తో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాదాపు 37 ఏళ్ల పాటు ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్న ఖమేనీ, అమెరికా – ఇజ్రాయెల్కు బద్ధశత్రువుగా నిలిచారు. హిజ్బుల్లా, హమాస్, హౌతీ రెబల్స్కు అండగా నిలుస్తూ మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యాన్ని పెంచారు. ఇదే సమయంలో ఆయన హయాంలోనే ఇరాన్ తీవ్ర ఆర్థిక ఆంక్షలు, అంతర్గత నిరసనలు, యువత తిరుగుబాట్లను ఎదుర్కొంది.
ఇరాన్ భవిష్యత్తు ఏంటి..
ఖమేనీ మరణంతో ఇరాన్లో ఇప్పుడు ‘అధికార శూన్యత’ ఏర్పడింది. ఆయనకు వారసుడెవరు? ఇస్లామిక్ రిపబ్లిక్ మనుగడ సాగిస్తుందా? లేక ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటారా? అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. లెబనాన్, సిరియా, యెమెన్లలో ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. ఇజ్రాయెల్, దాని మిత్రదేశాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఖమేనీ మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేసే అతిపెద్ద రాజకీయ పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇది శాంతికి దారితీస్తుందా లేదా మరో భీకర యుద్ధానికి కారణమవుతుందా అన్నది కాలమే నిర్ణయించాలని అభిప్రాయపడుతున్నారు.
Leader of Islamic Republic has been Martyred💔 pic.twitter.com/XlZ0MO8xbn
— IRAN MILITARY ☫ (@IranMilitaryEN) March 1, 2026
READ ALSO: Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!
