మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం పెర్త్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. చివరగా మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడిన టీమిండియా.. ఏడు నెలల తర్వాత మళ్లీ వన్డే మ్యాచ్ ఆడబోతోంది. వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్కు తొలి పరీక్ష ఎదురుకానుంది. ఇక కళ్లన్నీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. కంగారూ గడ్డపై ఈ దిగ్గజాలు తమదైన శైలిలో రాణిస్తారో చూడాలి.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆడనున్నాడు. రోహిత్ ఎప్పట్లాగే దూకుడుగా ఆడతాడా? లేదా? అన్నది చూడాలి. గిల్ ఎలాంటి ఆరంభాన్నిస్తాడో చూడాలి. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించనున్నాడు. శ్రేయస్ అయ్యర్, లోకేష్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి మిడిలార్డర్లో ఆడనున్నారు. ఇటీవల దేశవాళీల్లో దుమ్మురేపుతోన్న శ్రేయస్ ఆటపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇక తెలుగు ఆటగాడు నితీశ్ వన్డేల్లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. అక్షర్ పటేల్ బ్యాటుతో సత్తా చాటాతే టీమిండియాకు తిరుగుండదు.
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వన్డే సిరీస్కు అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ మీద అధిక భారం పడనుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఇష్టమైన వ్యక్తి హర్షిత్ రాణాకు మొదటి ప్రాధాన్యత దక్కనుంది. సిరాజ్తో కలిసి కొత్త బంతిని అతడు పంచుకోనున్నాడు. అర్ష్దీప్ సింగ్ ఉన్నా రాణాకే ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. మూడో పేసర్గా ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ల్లో ఒకరికి అవకాశం దక్కుతుంది. అక్షర్కు తోడుగా వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ల్లో ఒకరికి చోటు దక్కనుంది.
Also Read: Daily Horoscope: ఆదివారం దినఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!
భారత్ తుది జట్లు (అంచనా):
శుభ్మన్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, లోకేష్ రాహుల్, నితీశ్ రెడ్డి, అక్షర్పటేల్, వాషింగ్టన్ సుందర్/కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ/అర్ష్దీప్ సింగ్.