NTV Telugu Site icon

AP Crime: ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి.. ఆరా తీసిన సీఎం చంద్రబాబు

Attack On Inter Student

Attack On Inter Student

AP Crime: కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బద్వేలు సమీపంలో ఇంటర్‌ విద్యార్థినిపై పెట్లోల్ దాడి ఘటన కలకలం రేపింది. ఇంటర్‌ విద్యార్థినిని రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లి ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని స్థానికులు కడప రిమ్స్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే తమ కుమార్తెను ప్రేమ పేరుతో 8వ తరగతి నుంచి విఘ్నేష్ అనే యువకుడు వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. అతనికి పెళ్లి అయినా కూడా వేధింపులు ఆపలేదని వారు పోలీసులకు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలాన్ని జిల్లా జడ్జి నమోదు చేసుకున్నారు.

Read Also: YS Jagan: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది.. వైఎస్ జగన్ ట్వీట్

కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఘటనా స్థలికి జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులు వెళ్లారు. “మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తిని సస్పెక్ట్ చేస్తున్నాం. దస్తగిరమ్మ ఆటోలో పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర ఓ వ్యక్తిని ఎక్కించుకొని ఘటనా స్థలానికి చేరుకుంది…ఘటనా స్థలం నుండి యువతి కాలిన గాయాలతో బయటకు వచ్చింది. ఘటనా స్థలంలో ఏం జరిగింది అనే విషయాలపై ఆరా తీస్తున్నాము. కేసులో నిందితుడి కోసం 4 బృందాలు గాలిస్తున్నాయి. కేసును త్వరలోనే ఛేదిస్తాం.” అని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు.