ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయా? త్వరలోనే రెండు దేశాలు చర్చలు చేపట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇరాన్లో ప్రత్యక్షం కావడమే ఉదాహరణ.

గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందంపై చర్చ జరిగింది. దాదాపు 21 గంటల పాటు చర్చలు జరిగాయి. కానీ చివరికి చర్చలు విఫలం అయ్యాయి. ఈ చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. చర్చలు అర్ధాంతరంగా ముగియడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
తాజాగా అసిమ్ మునీర్ ఇరాన్లో ప్రత్యక్షమయ్యారు. వాషింగ్టన్ నుంచి వచ్చిన కొత్త సమాచారాన్ని ఇరాన్ పెద్దలతో పంచుకునేందుకు టెహ్రాన్లో ప్రత్యక్షమైనట్లు వార్తలు వస్తున్నాయి. చర్చలపై అమెరికా అందించిన సమాచారాన్ని మధ్యవర్తిగా అసిమ్ మునీర్ ఇరాన్తో పంచుకున్నారు. సమ్మతమైతే త్వరలోనే రెండు దేశాల మధ్య చర్చలు ఉండనున్నాయి. ఈసారి కూడా ఇస్లామాబాద్ వేదికగానే చర్చలు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. అమెరికా నుంచి వచ్చిన కొత్త సందేశాన్ని పాకిస్థాన్ తీసుకొచ్చిందని.. దీంతో చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.