Team India manager PVR Prashanth for Asia Cup 2025: ఆసియా కప్ 2025లో బరిలోకి దిగే భారత జట్టుకు తెలుగోడు పీవీఆర్ ప్రశాంత్ మేనేజర్గా నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి క్రికెట్ జట్టుకు ప్రశాంత్ ప్రాతినిధ్యం వహించారు. భీమవరానికి చెందిన ప్రశాంత్.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1997 వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టుకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా డీవీ సుబ్బారావు వ్యవహరించారు. 28 ఏళ్ల తర్వాత ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అవకాశం దక్కింది.
యూఏఈలో సెప్టెంబర్ 9న ఆసియా కప్ 2025 ఆరంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది. అఫ్గానిస్థాన్, హాంకాంగ్ పోరుతో టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఈ టోర్నీ కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా కొనసాగాడు. వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. దాంతో ప్రస్తుతం భారత జట్టులో ఇద్దరు తెలుగోళ్లు ఉన్నారు.