Ashok Sharma: జాతీయ జట్టు ప్రాతినిధ్యం వహించడం ప్రతీ క్రికెటర్కూ ఒక కల.. కానీ ఆ కలను నిజం చేసుకునే క్రమంలో కొందరి కథలు హృదయాలను పిండేస్తాయి. గురువారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్తో భారత అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టిన రాజస్థాన్కు చెందిన 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ ప్రయాణం కూడా సరిగ్గా అలాంటిదే. మ్యాచ్కు ముందు బౌలింగ్ కోచ్ సునీల్ జోషి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ‘ఇండియా క్యాప్’ అందుకోగానే భావోద్వేగానికి లోనైన అశోక్.. ఎట్టకేలకు తన కల నెరవేరిందన్నాడు. అంతేకాకుండా తన సుదీర్ఘ పోరాటాన్ని, ఈ సంతోషకర క్షణాన్ని తన అన్నయ్య త్యాగానికి అంకితమిస్తున్నట్లు ప్రకటించి అందరినీ కదిలించాడు.
జైపూర్ సమీపంలోని రాంపుర అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన అశోక్ శర్మ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉండేవి. అశోక్, ఆయన అన్నయ్య అక్షయ్ శర్మ ఇద్దరినీ క్రికెటర్లుగా ప్రోత్సహించేంత స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో తమ్ముడి భవిష్యత్తు కోసం అన్నయ్య అక్షయ్ క్రికెట్ను త్యాగం చేశాడు. తన సొంత క్రికెట్ ఆశయాలను పక్కనపెట్టి, అశోక్ అండర్-16 ఇంటర్-డిస్ట్రిక్ట్ సెలక్షన్ ట్రయల్స్కు వెళ్లేలా బాటలు వేశాడు. అన్నయ్య చేసిన ఆ నిస్వార్థ త్యాగమే అశోక్ క్రికెట్ కెరీర్లో అతిపెద్ద మలుపుగా మారింది. అరంగేట్రానికి ముందు తాత్కాలిక హెడ్ కోచ్ వివిఎస్ లక్ష్మణ్.. అశోక్ శర్మతో ప్రత్యేకంగా మాట్లాడారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గొప్ప గౌరవమని, ఇన్నాళ్లు పడిన కష్టానికి, చూపించిన అత్యుత్తమ ప్రతిభకు దక్కిన ప్రతిఫలమే ఈ అవకాశమని లక్ష్మణ్ కొనియాడారు. మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్ ఏమీ తీసుకోకుండా 29 పరుగులిచ్చినప్పటికీ, అశోక్ తన అద్భుతమైన వేగంతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
గత ఏడాది కాలంలో అశోక్ శర్మ ఎదుగుదల అత్యంత వేగంగా సాగింది. 2025-26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఏకంగా 22 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఆ ప్రదర్శనతో ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ఏకంగా గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి, ఆ సీజన్లోనే అత్యంత వేగవంతమైన డెలివరీ నమోదు చేసి వార్తల్లో నిలిచాడు. వాస్తవానికి ఒక దశలో క్రికెట్కు దాదాపు స్వస్తి చెప్పాలనుకున్న అశోక్, రెడ్ బుల్ స్పేడ్స్టర్ పోటీల్లో పాల్గొనడంతో రాజస్థాన్ రాయల్స్ నెట్ బౌలర్గా అవకాశం సాధించాడు. అక్కడి నుంచి మొదలైన అతని నిరంతర శ్రమ, నేడు ఏకంగా టీమిండియా బ్లూ జెర్సీని తొడిగేలా చేసింది.

