గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం కర్ణాటకలో నెల్లూరు పోలీసులు కాకాణిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కాకాణిని నెల్లూరులోని డీటీసీకి పోలీసులు తీసుకొచ్చారు. రేపు వెంకటగిరి మేజిస్టేట్ ముందు కాకాణిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పొదలకూరు పోలీసుస్టేషన్లో గత ఫిబ్రవరిలో ఆయనపై కేసు నమోదైంది.
వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి.. టన్నుల కొద్ది క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఫిర్యాదు ఇచ్చారు. దాంతో ఫిబ్రవరి 16న ఆయనపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న కాకాణి పోలీసుల విచారణకి హాజరు కాకుండా రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. నెల్లూరులో ఒకసారి, హైదరాబాదులో రెండుసార్లు కాకాణి కుటుంబ సభ్యులకి నెల్లూరు పోలీసులు నోటీస్లు ఇచ్చారు. బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినా కాకాణికి ఊరట దక్కలేదు. రెండు నెలలుగా పరారీలో ఉన్న కాకాణి ఎట్టకేలకు ఈరోజు ఏపీ పోలీసులకు చిక్కారు.