నాలుగు రోజుల విరామం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల సమయంతో సభా కార్యక్రమాలు మొదలుకానున్నాయి. వివిధ ప్రజా సమస్యలు, పాలనకు సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సభ్యులు సిద్ధమయ్యారు.
ఇవాళ ప్రశ్నోత్తరాల్లో ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకాల ఏర్పాటు అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు వివరణ కోరనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులపై నమోదవుతున్న అక్రమ కేసుల అంశం కూడా చర్చకు రానుంది. అమరావతి బాహ్య వలయ రహదారి నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ, కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగుల బదిలీల సమస్యలు, వడ్డెర-రజక-పల్లెకార సామాజిక వర్గాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చే అంశాలపై కూడా సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమ చర్యలు, జిల్లా న్యాయస్థానాల్లో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదుల నియామకం వంటి అంశాలు కూడా సభలో ప్రస్తావనకు రానున్నాయి.
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీ, పరిశ్రమలకు తాటిపూడి జలాశయం నుంచి నీటి సరఫరా, చిన్న మరియు మధ్య తరహా సాగునీటి చెరువుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానాలు కోరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఇవాళ కూడా లడ్డూ అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో శాసనమండలిలో హాట్ హాట్ చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
