AP High Court: ఇదేం పద్ధతి, ఇదేం భాష?.. గుంటూరు మేయర్‌కు హైకోర్టు చురకలు

  • గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడికి ఏపీ హైకోర్టు చురకలు
  • నగర మొదట పౌరుడిగా బాధ్యతగా మెలగమని చెప్పాలని మేయర్‌ తరఫు న్యాయవాదికి ఆదేశం
Ap High Court

Ap High Court

AP High Court: అరండల్‌పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడికి ఏపీ హైకోర్టు చురకలు అంటించింది. “ఇదేం పద్ధతి,ఇదేం భాష…?. అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేస్తారా?. నగర మొదటి పౌరుడు మాట్లాడేది ఇలాగేనా. సేవచేసి ప్రజలకు దగ్గరవ్వాలే తప్ప అసభ్యకర భాషతో కాదు. మురికి భాషను ఉపయోగించి ఎన్నికలను గెలవాలని అనుకోకూడదు. అసభ్యకర భాష వాడినవారు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందే. రాజకీయపార్టీలు అవతలివారి విధానాలు, పాలసీలను విమర్శించాలి…ప్రజాస్వామ్యంలో మేయర్ వాడిన పదజాలాన్ని అంగీకరించలేం. నగరమేయర్ ఇతర పౌరులకు ఆదర్శంగా ఉండాలి ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.” అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Read Also: Fraud: సైబరాబాద్‌లో బిగ్ స్కాం.. రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన సంస్థ

నగర మొదట పౌరుడిగా నిందితుడిని బాధ్యతగా మెలగమని చెప్పాలని మనోహర్ నాయుడు తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనని.. పిటిషనర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం తెలిపింది. కేసుపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 6వారాలకు వాయిదా వేసింది.

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌క వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేపడుతున్న తమను మేయర్, ఆయన అనుచరులు దూషించి పోలీసు లాఠీతో దాడి చేశారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు గుంటూరు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, నారా లోకేశ్‌ను అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొ్న్నారు. ఫిర్యాదు ఆధారంగా మేయర్, ఆయన అనుచరులపై పోలీసులు ఈ నెల 16న కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన క్రమంలో మేయర్ కావటి మనోహర్‌ నాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు.