Andhra Pradesh: ఏపీలో పింఛన్ల పంపిణీపై కొనసాగుతున్న సందిగ్ధతపై ఎట్టకేలకు క్లారిటీ లభించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని స్పష్టం చేసింది. పింఛను లబ్ధిదారులు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సెర్ప్ సూచించింది.
Read Also: Chandrababu: ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం..
పింఛన్లు సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పెన్షన్లు సహా లబ్దిదారులకు నగదు పంపిణీ వంటి కార్యక్రమాల అమలుకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని సీఈసీ సూచించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత వరకు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన ట్యాబులు, ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. డీబీటీ స్కీంల అమల్లో వాలంటీర్లకు ప్రత్యామ్నాయాలు చూడాలని ఏపీ సీఈఓకు ఈసీ స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి ఏపీ సీఈఓ సూచించిన సంగతి తెలిసిందే.