NTV Telugu Site icon

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు భేటీ

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం హత్య ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు డీజీపీ ద్వారకా తిరుమల రావు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు. త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని డీజీపీకి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల రక్షణకు హై ప్రయార్టీ ఇవ్వాలని డీజీపీకి ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈపూరుపాలెం ఘటనలో దోషులకు వెంటనే కఠిన శిక్ష పడేలా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Read Also: AP Crime: ఈపురుపాలెంలో మహిళ హత్య.. బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రికి సీఎం ఆదేశం

సుచరిత దారుణ హత్య!
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన సుచరిత(21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కూతురు ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో వెతుకుతూ వెళ్లిన తల్లికి స్థానిక గర్ల్స్ హైస్కూల్ సమీపంలో కుమార్తె సుచరిత మృతదేహం కనిపించింది. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. సుచరిత మృతిని అత్యాచారం, అనంతరం హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఘటన వివరాలను ఎస్పీ వకుల్ జిందాల్ యువతి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం సుచరిత హత్య గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని, ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలని హోంమంత్రికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. దర్యాప్తులో అలసత్వం లేకుండా.. జాప్యం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హత్య జరిగిన ఈపూరుపాలెంకు హోంమంత్రి అనిత బయలుదేరారు.