జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తన వేతనం మొత్తాన్ని పిఠాపురం నియోజకవర్గ అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగించనున్నట్లు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో 42 మంది అనాధ పిల్లలకు నెలకు రూ.5000 చొప్పున తన వేతనం నుండి అందిస్తానని ప్రకటించారు. మిగిలిన జీతం కూడా వారి బాగోగుల కోసమే ఖర్చు పెడతానని పవన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం, పదవి ఉన్నంతకాలం ప్రతి నెల ఒకటో తేదీన 42 మందికి రూ.5000 చొప్పున అందిస్తానని హామీ ఇచ్చారు.
Also Read: Raghunandan Rao: చంపుతూ పోతుంటే చూసుకుంటూ పోవాలా.. ఉగ్రవాదులను చంపితే వీళ్లకేంటి నొప్పి?
శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 32 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున ఆర్థిక సాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందించారు. మిగతా పది మందికి డబ్బులు అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ‘పిఠాపురం నియోజకవర్గ ప్రజలు నమ్మకంతో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత. పిఠాపురం ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన వేతనాన్ని అక్కడే వినియోగించాలనుకున్నా. నియోజకవర్గం పరిధిలో తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల భవిష్యత్తు కోసం ఇస్తా. ప్రభుత్వం, పదవి ఉన్నంతకాలం నా జీతం మొత్తాన్ని అనాధ పిల్లల సంక్షేమానికి వినియోగిస్తా’ అని చెప్పారు.