NTV Telugu Site icon

Amaravati Drone Summit 2024: అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 కోసం విస్తృత ఏర్పాట్లు

Amaravati Drone Summit 2024

Amaravati Drone Summit 2024

Amaravati Drone Summit 2024: ఈనెల 22,23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024 విజయవంతానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈమేరకు డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి వివిధ శాఖల కార్యదర్శులు,ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా పెద్ద ఎత్తున డ్రోన్ సమ్మిట్‌ను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. కావున ఈ రెండు రోజుల డ్రోన్ సమ్మిట్‌ను పూర్తిగా విజయవంతం చేసేందుకు వివిధ శాఖల కార్యదర్శులు వెంటనే సదస్సు ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సదస్సుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది వరకు వక్తలు, ప్రతినిధులు పాల్గొననున్నారని, అంతేగాక 1000 మంది వరకూ వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రతినిధులు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్, సాంకేతిక అభిలాషులు, తదితరులు పాల్గొంటారని సీఎస్ పేర్కొన్నారు.

ఈ రెండు రోజుల డ్రోన్ సమ్మిట్‌లో ప్రధానంగా డ్రోన్ల తయారీ, వ్యవసాయ, లాజిస్టిక్స్, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, ఆరోగ్యం, తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగం అంశాలపై 9 సెషన్లు నిర్వహించడం జరుగుతుందని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. అంతేగాక డ్రోన్ల సాంకేతికత వినియోగంపై 4 కీలకమైన ప్రజంటేషన్లతో పాటు బిల్డింగ్ ఏ క్రాంప్రహెన్సివ్ డ్రోన్ ఇకో సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మరియు అమరావతిని భవిష్యత్తులో డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియా తీర్చిదిద్దే అంశంపై ఒక ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుందని అన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా డ్రోన్ తయారీ దారులు వారి ఉత్పత్తులకు సంబంధించిన 40 ప్రదర్శన శాలలను వేదిక వద్ద ఏర్పాటు చేయనున్నారు. అంతేగాక డ్రోన్ డిమానిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుందని సీఎస్ తెలిపారు.

Read Also: Hyderabad: మియాపూర్‌లో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు

అదే విధంగా 2030 నాటికి భారత్‌ను గ్లోబల్ డ్రోన్ హబ్‌గా రూపొందించడం, డ్రోన్ రెగ్యులేషన్స్‌పై ఫ్యానల్ డిస్కషన్స్ ఉంటాయని చెప్పారు. అంతేగాక పబ్లిక్ సేఫ్టీ, విపత్తుల నిర్వహణ, డ్రోన్ సాంకేతికత అప్లికేషన్స్ అడాప్సన్, పబ్లిక్ ప్లానింగ్ పైన, స్కిల్డ్ మేన్ పవర్ ఫర్ డ్రోన్ ఇకో సిస్టమ్ ఇన్ ఇండియా, పర్యాటక, వినోద రంగాల్లో డ్రోన్స్‌ ఇన్నోవేషన్, ఏరియల్ ఎక్సిపీరియన్సెస్ అంశాలపైన ఫ్యానల్ చర్చలు నిర్వహిస్తారని తెలిపారు. వ్యవసాయ, ఆరోగ్య, లాజిస్టిక్ రంగాల్లో డ్రోన్ల వినియోగం, సర్వే సెటిల్మెంట్స్, భూ రికార్డులు, డిజిటల్ లాండ్ రికార్డులు తయారీలో డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై ఫ్యానల్ డిస్కషన్స్ జరుగుతాయని సీఎస్ పేర్కొన్నారు.రెండు రోజుల అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024లో భాగంగా 22వ తేది సాయంత్రం 6గం.ల నుండి రాత్రి 8గం.ల వరకూ విజయవాడ కృష్ణానది ఒడ్డున బెర్మ పార్కు వద్ద పలు సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా 5వేల డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షోను నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతేగాక లేజర్ బీం షో, ఫైర్ వర్క్సు, మ్యూజిక్ బ్యాండ్ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఈరెండు రోజుల డ్రోన్ సమ్మిట్ కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సహా కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి, పలువురు రాష్ట్ర మంత్రులు,పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని సీఎస్ చెప్పారు. కావున ఈసమ్మిట్ విజయవంతానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ వీడియో సమావేశానికి వర్చువల్‌గా పాల్గొన్న ఐ అండ్ ఐ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈడ్రోన్ సమ్మిట్ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. వివిధ శాఖల నుండి 10 ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమించాలని ఆయా శాఖల కార్యదర్శులను కోరినట్టు తెలిపారు. ఇప్పటికే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. సమావేశంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె.దినేష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 కు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సీఎస్ కు వివరించారు.