YSR Argoyasri Smart Cards: నేటి నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనుంది ఏపీ సర్కారు. ఇవాళ్టి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. కార్డులో క్యూఆర్ కోడ్, లబ్ధిదారుని ఫోటో, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్య వివరాలతో ABHA ఐడీ అందించనున్నారు. 4.52 లక్షల మంది లబ్ధిదారులకు ఆరోగ్య శ్రీ సేవలపై అవగాహన కల్పించనున్నారు.
Read Also: Gandhi Bhavan: నేడు గాంధీభవన్లో పీఏసీ కీలక భేటీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ?
ఇక, ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అమలులో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు నూతన కార్డులు ఇవాళ్టి నుంచి మంజూరు చేయనుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా రూ. 25 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయం అమలుకు ఇప్పటికే ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతీ ఇంటిలో ఒకరికీ ఆరోగ్యశ్రీ యాప్ తప్పనిసరి చేసింది. ప్రతీ ఇంటికి వెళ్లాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
ఇక, ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు నూతన కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రతీ ఇంటికి సచివాలయ – ఆరోగ్య సిబ్బందిని పంపాలని డిసైడ్ అయింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ బ్రోచర్లను పంపిణీ చేయడం, నూతన లబ్ధిదారులను గుర్తించడం, కొత్త కార్డులను ఇవ్వడంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష గురించి అవగాహన కల్పించనున్నారు.
అలాగే, దిశ యాప్ తరహాలో రూపొందించిన ఆరోగ్యశ్రీ యాప్ను కూడా ఇంటిలో ఒకరి ఫోన్ లో డౌన్లోడ్ చేయాల్సి ఉంటుందని ఏపీ సర్కార్ పేర్కొంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కొత్త కార్డులను కూడా జారీ చేస్తుంది. ఇంటింటికి వెళ్తున్న సిబ్బంది వీటిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇంటి యజయాని ఈ-కేవైసీ తీసుకునే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల గురించి కూడా వీరు ప్రచారం చేయనున్నారు. నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ మద్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్బీకె భవన్లలో ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు లబ్ది దారులను సమీకరించాలని ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా పాల్గనాలని ఆదేశించింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జనవరి 1వ తేదీ నుంచి కొనసాగించాలని ప్రభుత్వం చెప్పింది.