CM Chandrababu: ఏపీలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయడం, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 విధానాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు. పరిశ్రమల ఏర్పాటులో అనవసరమైన అడ్డంకులను తొలగించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న 800కి పైగా నిబంధనలను 100లోపు పరిమితం చేయాలని సీఎస్ సహా ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. అదేవిధంగా, పర్మిషన్లు, లైసెన్సులను సింగిల్ డిజిట్కు తగ్గించాలని సూచించారు.
South Vs North : సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్లుగా మారిపోయిన బాక్సాఫీస్ లెక్కలు
అయితే ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలలో ఎలాంటి రాజీ పడకూడదని సీఎం స్పష్టం చేశారు. అనవసర వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆదేశించారు. అటవీ చట్టాలను సాధ్యమైనంత మేర సరళీకరించాలని కేంద్ర బృందానికి సూచించారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్రానికి అనుకూలమైన నిబంధనలు అమలు చేయాలని సీఎం అభిప్రాయపడ్డారు. డబుల్ లైసెన్సింగ్ విధానాలను పూర్తిగా తొలగించాలని, ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాలం చెల్లుబాటు అయ్యే విధంగా మార్పులు చేయాలని సూచించారు.
డీ-రెగ్యులేషన్ ఫేజ్-2ను మే నెలాఖరులోగా అమల్లోకి తీసుకురావాలని సీఎం ఆదేశిస్తూ, ఇందుకు అవసరమైన ఆర్డినెన్సులను వెంటనే తీసుకురావాలని పేర్కొన్నారు. దరఖాస్తు నుంచి అనుమతుల వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఫేజ్-2 అమలుతో పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో కనీసం 40% సమయం తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ మాట్లాడుతూ.. పరిశ్రమలకు అనుమతులు, నిబంధనల సడలింపులో రాష్ట్రం కేంద్ర ప్రతిపాదనల కంటే ముందంజలో ఉందని అభినందించారు.
దీనికి ప్రతిస్పందనగా సీఎం, రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు “స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్” విధానాన్ని అనుసరిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై కూడా చర్చ జరిగింది. జూన్ నెల నుంచి ఫేజ్-3పై పని ప్రారంభిస్తామని కేంద్ర ప్రతినిధులు తెలిపారు. ఫేజ్-3లో టెక్నాలజీ అనుసంధానం, ఏఐ టూల్స్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే డేటా లేక్, రియల్ టైమ్ డేటా, సీఎఫ్ఎంఎస్, అవేర్-2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వ్యవస్థలను సమర్థంగా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.