AP CEO MK Meena: తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఏపీలో మొత్తంగా 4.08 కోట్ల ఓటర్లున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే 5.85 లక్షల ఓటర్ల మేర పెరిగారని ఆయన చెప్పారు. 18-19 మధ్య వయస్సున్న యువ ఓటర్లు- 8.13 లక్షల మంది ఉన్నారని.. యువ ఓటర్ల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉందని.. దీనిపై ప్రచారం చేపడతామన్నారు. ఓట్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు పరిష్కరించామని ఈ సందర్భంగా చెప్పారు. ఒకే ఇంట్లో పది మందికి పైగా ఓటర్లున్నారనే ఫిర్యాదులను సుమారు 98 శాతం వరకు పరిష్కరించామన్నారు.
Read Also: CM YS Jagan: ఈ నెల 24న సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటన
14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని.. ఈ ఫిర్యాదులను పరిశీలించామని.. 5.64 లక్షల ఓట్లను తొలగించామని చెప్పారు. ఫాం-7 దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదుల పైనా ఫోకస్ పెట్టామన్నారు. ఓటర్ల జాబితా అవకతవకలకపై ఏపీలో మొత్తంగా 70 కేసులు నమోదయ్యాయన్నారు. నామినేషన్ చివరి రోజు వరకు ఓట్లని నమోదు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఏమైనా తప్పిదాలు ఉంటే.. ఆ అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. ప్రతి ఓటరు తన పేరుని ఓటర్ లిస్టులో చెక్ చేసుకోవాలని ఏపీ సీఈవో ఎంకే మీనా సూచించారు. ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ విషయంలో ఓ ఐఏఎస్ అధికారి సహా ముగ్గురు సస్పెండ్ అయ్యారని ఆయన చెప్పారు. ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారం వెనుక ఎవరున్నారోననే అంశంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.