‘ఫీజు పోరు’ అని ముందుగా పేరు పెట్టి.. ఆ తర్వాత ‘యువత పోరు’ అని పేరు మార్చటంపై జనాలు నవ్వుకుంటున్నారని మంత్రి నారా లోకేష్ వైసీపీపై సెటైర్లు వేశారు. అసలు వైసీపీ వాళ్లకు దేని మీద పోరాడుతున్నారో కనీసం క్లారిటీ ఉండాలి కదా? అని ఎద్దేవా చేశారు. స్వల్పకాలిక ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు తాము సిద్ధం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఏపీ శాసనమండలి సమావేశాలు ఈరోజు మొదలయ్యాయి. నిరుద్యోగ భృతి విడుదల, యువతకు ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం చేశారు. వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్వల్పకాలిక ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు సిద్ధం అని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
‘ఫీజు పోరు అని ముందుగా పేరు పెట్టి.. ఆ తర్వాత యువత పోరు అని పేరు మార్చటంపై అందరూ నవ్వుకుంటున్నారు. అసలు వైసీపీ వాళ్లకు అయినా దేని మీద పోరాడుతున్నారో ఓ క్లారిటీ ఉండాలి. గతంలో ఫీజులు రూ.4500 కోట్లు బకాయిలు పెట్టారు.. ఇప్పుడు ధర్నా అంటారు. వారే కరెంట్ చార్జీలు పెంచారు.. మరలా వాళ్లే ధర్నా అంటారు. ఎందుకు బకాయిలు పెట్టారో చర్చకు సిద్ధమా?. ఫీజు రీయింబర్స్మెంట్ పైన మాట్లాడతాం. గత ప్రభుత్వం వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయాయో చర్చిద్దాం’ అని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఆపై నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని వైసీపీ సభ్యుల నినాదాలు చేశారు. సభ్యులు ఎంతకీ నినాదాలు ఆపకపోవటంతో చైర్మన్ మండలిని 10 నిమిషాలు వాయిదా వేశారు.