నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఇకపై సభ్యుల హాజరు నమోదు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా జరగనుంది. సభ్యులు అసెంబ్లీకి వచ్చి సభ లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత మాత్రమే వారి హాజరు నమోదు అయ్యే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ కొత్త విధానాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రవేశపెట్టారు. ఇకపై సంప్రదాయంగా ఉపయోగిస్తున్న హాజరు రిజిస్టర్ విధానం ఉండదని అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్న కుమార్ నిన్న విడుదల చేసిన బులెటిన్లో తెలిపారు. సభ్యుల హాజరు వ్యవస్థను పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా మార్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: YS Jagan: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. హాజరుకానున్న వైఎస్ జగన్!
ఇటీవల కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే హాజరు పట్టికలో సంతకం చేస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపించాయి. కొందరు సభ్యులు అసెంబ్లీ భవనానికి వచ్చి.. లోపలికి వెళ్లకుండానే సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారనే చర్చ కూడా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు వ్యవస్థ అమలు అసెంబ్లీ కార్యకలాపాల్లో క్రమశిక్షణ పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ విధానం ఇతర శాసనసభల్లో కూడా అమలు అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
