Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!

Tvk

Tvk

Tamil Nadu: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని కలిగి ఉంటాయి. దశాబ్దాలుగా అక్కడ ద్రావిడ సిద్ధాంతాలు, డీఎంకే (DMK)-ఏఐఏడీఎంకే (AIADMK) ద్వంద్వ పోరాటాలే శాసించాయి. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ ఆరు దశాబ్దాల రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. కేవలం రెండేళ్ల క్రితం ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించిన ప్రముఖ నటుడు విజయ్.. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగారు. మొత్తం 234 స్థానాలకు గాను ఒంటరిగానే 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించడం ద్వారా ద్రావిడ పార్టీల గుత్తాధిపత్యానికి విజయ్ తెరదించారు. అయితే, విజయ్ సాధించిన ఈ బ్లాక్‌బస్టర్ విజయం వెనుక.. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కొన్నేళ్ల క్రితమే ఊహించిన ఒక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై ఆరేళ్ల క్రితం బీజేపీలో చేరినప్పుడు, ఆయనను ఒక ‘అవుట్‌సైడర్’గా చూశారు. ఉత్తరాది రాజకీయ నమూనాను ద్రావిడ గడ్డపై రుద్దాలని చూస్తున్నారంటూ విమర్శించారు. కానీ, తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద శూన్యత ఏర్పడిందని, కరుణానిధి, జయలలిత లాంటి దిగ్గజాలు లేని తరుణంలో ఓటర్లు సాంప్రదాయ బైనరీల నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నారని అన్నామలై బలంగా నమ్మారు. తమిళ ఆత్మగౌరవం, జాతీయవాదం, సమర్థవంతమైన పాలనల కలయికతో ఒక మూడో ప్రత్యామ్నాయ శక్తి ఉద్భవిస్తుందని పదే పదే వాదించారు. అన్నామలై చేసిన ఈ రాజకీయ విశ్లేషణ అక్షరాలా నిజమైంది, కానీ దాని ఫలాలను అందుకుంది మాత్రం బీజేపీ కాదు.. నటుడు విజయ్!

అన్నామలై ఆలోచన బాగున్నా, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాలం కలిసిరాలేదు. ముఖ్యంగా బీజేపీ జాతీయ నాయకత్వానికి ఓపిక నశించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై ‘ఎన్ మణ్, ఎన్ మక్కల్’ (నా నేల, నా ప్రజలు) పేరిట 1,700 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి, పార్టీ ఓటు బ్యాంకును 3 శాతం నుంచి 11 శాతానికి పైగా పెంచగలిగారు. అయినా సీట్లు గెలవకపోవడం, స్వయంగా అన్నామలై కోయంబత్తూరులో లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోవడంతో అధిష్టానం ఆందోళన చెందింది. ఒంటరి పోరాటం వర్కవుట్ కాదని భావించి, పాత మిత్రపక్షమైన ఏఐఏడీఎంకేతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. అయితే, అన్నామలై గతంలో ఏఐఏడీఎంకే ఐకాన్స్ అయిన అన్నాదురై, జయలలితలపై చేసిన ఘాటు విమర్శల వల్ల ఆ పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉంది. పొత్తు సజావుగా సాగాలంటే అన్నామలైని తప్పించడం అనివార్యమైంది. దీంతో 2025లో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించి, మాజీ మంత్రి నైనార్ నాగేంద్రన్‌కు బాధ్యతలు అప్పగించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలైకి కనీసం పోటీ చేసేందుకు వీలు కల్పించలేదు. ఫలితంగా, సొంతంగా ఎదగాలనుకున్న బీజేపీ ప్రయోగం అక్కడితో ముగిసింది. పొత్తు పెట్టుకున్నా బీజేపీ ఓటు షేర్ మళ్లీ 3 శాతానికి పడిపోయింది.

×
×
Ad

బీజేపీ వదిలేసిన ఈ మూడో స్థానాన్ని విజయ్ అత్యంత చాకచక్యంగా ఆక్రమించారు. అన్నామలై నమ్మిన సిద్ధాంతాలనే విజయ్ కాస్త భిన్నంగా, తమిళులకు నచ్చేలా ‘నియో-ద్రావిడిజం’ (నవ్య ద్రావిడవాదం) రూపంలో ప్యాకేజ్ చేశారు. పెరియార్‌ను మాత్రమే కేంద్ర బిందువుగా ఉంచకుండా.. బి.ఆర్. అంబేద్కర్, కామరాజ్ వంటి నేతలతో పాటు వేలు నాచియార్, అంజలై అమ్మాళ్ వంటి వీరనారీలను తన రాజకీయ ఐకాన్స్‌గా ప్రకటించారు. దీనివల్ల ద్రావిడ ఓటర్లు, కరడుగట్టిన యాంటీ-డీఎంకే ఓటర్లు, యువత, మార్పును కోరుకునే తటస్థులు అందరూ విజయ్ వైపు మొగ్గు చూపారు. పైగా, బీజేపీకి ఉన్న ముద్ర (ట్యాగ్) విజయ్‌కు లేకపోవడం, ఆయనకున్న భారీ సినిమా క్రేజ్, బలమైన ఫ్యాన్స్ నెట్‌వర్క్, ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఆయనకు కలిసివచ్చాయి. ఇలా తన వ్యూహాలను వేరొకరు అమలు చేసి సక్సెస్ కావడం, మరోవైపు పార్టీ అంతర్గత అడ్డంకులు, జాతీయ నాయకత్వం తమిళనాడు రాజకీయాల వైవిధ్యాన్ని అర్థం చేసుకోకపోవడంపై అన్నామలై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన జూన్ 2న అమిత్ షా, నితిన్ నబిన్, బి.ఎల్. సంతోష్‌లను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. జాతీయ పార్టీలు తమిళనాడు భాషను, సంస్కృతిని ఎప్పటికీ సరిగ్గా అర్థం చేసుకోలేవని ఆ లేఖలో కుండబద్దలు కొట్టారు. పార్టీ అగ్రనాయకత్వం ఆయనను బుజ్జగించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించినప్పటికీ, అన్నామలై తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఎట్టకేలకు శుక్రవారం రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించారు.

బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నామలై.. ఇకపై ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా సొంతంగా ఒక స్వతంత్ర రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే తమిళనాడు ఆకాంక్షలను పూర్తిగా నెరవేర్చలేరని వ్యాఖ్యానిస్తూ, యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కోయంబత్తూరులో ‘ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్’ సంస్థను స్థాపించనున్నారు. ఆయన పిలుపునిచ్చిన కేవలం 10 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది యువత ఈ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మూవ్‌మెంట్‌లో రిజిస్టర్ చేసుకోవడం విశేషం. ఏదేమైనా, తమిళనాడు రాజకీయాల్లో మార్పు వస్తుందన్న అన్నామలై జోస్యం నిజమైంది. కాకపోతే, ఆ మార్పుకు సారథిగా నిలిచింది మాత్రం నటుడు విజయ్. ఇప్పుడు అన్నామలై కూడా తనదైన శైలిలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంతో, రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయం మరిన్ని ఆసక్తికర మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.