Ambati Rambabu: గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రిక్షా తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని అంబటి రాంబాబు ఆరోపించారు. ఇదేనా సంపద సృష్టి, ఇదేనా సుపరిపాలన అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర పన్నులు తగ్గించి ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
“లోకేష్ కాదు.. ఆయన పేరు లవ్ క్యాష్” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన అంబటి, కమీషన్లు వచ్చే పనులపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు ఎలాంటి పొంతన లేదని విమర్శించారు. ఆర్టీసీ, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించిన అంబటి, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇక “రెడ్ బుక్” అంశంపై కూడా ఆయన స్పందించారు అంబటి రాంబాబు.. “రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన నేతలపై కూడా అమలు చేస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. ముట్లూరు ఘర్షణ ఘటనలో జనసేన కార్యకర్తలపైనే కేసులు పెట్టారని, అయితే టిడిపికి చెందిన కల్యాణ చక్రవర్తిపై నమోదైన కేసులను మాత్రం మాఫీ చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడతానని చెప్పిన పవన్ కల్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అధికార మదంతో తమను గెలిపించిన వారిపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇక జనాభా పెంపుపై ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలపై కూడా అంబటి రాంబాబు స్పందించారు. పిల్లలను కనాలని చెప్పే నైతిక హక్కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదంటూ విమర్శలు చేశారు.
