అమరావతి పునర్నిర్మాణ పనులకు శుక్రవారం వెలగపూడిలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. సభా వేదిక పైనుంచే 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. రాజధాని పనులు సహా రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రూ.49,040 కోట్ల విలువైన రాజధాని పనులకు, రూ.8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. పనుల ప్రారంభానికి ప్రతీకగా అమరావతి పైలాన్ను ప్రధాని ఆవిష్కరించారు.
అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. తల్లి దుర్గ భవానీ కొలువైన పుణ్య భూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉందని ప్రధాని అన్నారు. ‘అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు కనిపిస్తోంది. చారిత్రక పరంపర, ప్రగతి రెండు కలిసి పయనిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్, బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిసిన ప్రాంతం ఇది. అమరావతి ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ను ఆధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉంది. ఏపీలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుంది’ అని అన్నారు.
Also Read: PM Modi: ప్రధాని మోడీ మరో పేరును రివీల్ చేసిన పవన్ కల్యాణ్.. అదేంటో తెలుసా?
‘ఏఐ, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, విద్యా రంగాల్లో అమరావతి ముందు ఉంటుంది. ఇవి కేవలం శంకుస్థాపనలు కాదు ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కు నిదర్శనం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభసంకేతం. రికార్డు స్పీడ్లో పనులు పూర్తి చేయడానికి కేంద్రం సహకరిస్తుంది. అమరావతిలో మౌలిక సదుపాయల కోసం కేంద్రం సహకరించింది. అమరావతికి ఉన్న ఆటంకాలు తొలగిపోయి ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాకు టెక్నాలజీ వాడకం గురించి చెప్పారు. నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని గమనించాను’ అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.