Site icon NTV Telugu

బ్యాంక్ ఖాతా అద్దెకిస్తూ.. నెలకు రూ.25 వేల సంపాదన.. వెలుగులోకి కొత్త స్కామ్..

Money

Money

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.550 కోట్ల భారీ హవాలా కుంభకోణం వెలుగులోకి రావడంతో దర్యాప్తు సంస్థలు విస్తుపోతున్నాయి. కేవలం రూ.10 వేల నుంచి రూ.12 వేల నెలసరి ఆదాయం కలిగిన ఒక సామాన్య రాపిడో డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ.300 కోట్లు చేతులు మారడం చూస్తుంటే.. మోసగాళ్లు సామాన్యులను ఏ స్థాయిలో పావులుగా వాడుకుంటున్నారో అర్థమవుతోంది. అసలు ఏం జరిగిందంటే..

అహ్మదాబాద్‌కు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతనికి కిరణ్ అనే వ్యక్తి పరిచయమై.. ఒక ప్రతిపాదన చేశాడు. ‘నీ బ్యాంకు ఖాతాను వాడుకోవడానికి ఇస్తే.. ప్రతి నెలా నీకు రూ.25,000 అద్దె చెల్లిస్తానని ఆశ చూపాడు. కష్టపడకుండా వచ్చే డబ్బు కదా అని ప్రదీప్ తన బ్యాంక్ పాస్‌బుక్, చెక్ బుక్, ఏటీఎం కార్డులను కిరణ్‌కు అప్పగించాడు. అయితే.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు జరిపిన సోదాల్లో ప్రదీప్ ఖాతా ద్వారా అక్రమంగా క్రికెట్ బెట్టింగ్, నకిలీ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల సొమ్మును విదేశాలకు మళ్లించినట్లు గుర్తించారు. కేవలం ఒక డ్రైవర్ ఖాతా నుంచే రూ.300 కోట్లు, మొత్తం ముఠా ద్వారా రూ.550 కోట్లు చేతులు మారాయని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ప్రదీప్ పోలీసుల అదుపులో ఉండగా.. అసలైన సూత్రధారుల కోసం గాలింపు జరుగుతోంది.

Read Also:Dwcra Group: మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షల బీమా.. ప్రభుత్వం కీలక ప్రకటన..

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని రకరకాల మార్గాల్లో దోచుకుంటున్నారు. ప్రదీప్ విషయంలో జరిగినట్లుగానే.. విద్యార్థుల బ్యాంకు ఖాతాలను కొంత మొత్తానికి అద్దెకు తీసుకుంటారు. ఆ ఖాతాల ద్వారా నేరగాళ్లు దొంగిలించిన డబ్బును మళ్లించి.. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటారు. చివరకు ఖాతా కలిగిన అమాయక విద్యార్థులు, డ్రైవర్లు, రోజు వారి కూలీలు జైలు పాలవుతున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి.. నకిలీ యాప్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టిస్తారు. స్క్రీన్‌పై లాభాలు కనిపిస్తాయి కానీ.. విత్‌డ్రా చేసుకునే సమయానికి మీ ఖాతాను బ్లాక్ చేస్తారు.

పోలీసులమని లేదా సీబీఐ అధికారులమని వీడియో కాల్ చేసి.. మీ పేరు మీద డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని భయపెట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోలకు లైక్స్ కొట్టడం లేదా హోటల్స్ రేటింగ్స్ ఇవ్వడం ద్వారా రోజుకు వేల రూపాయలు సంపాదించవచ్చని ఆశ చూపుతారు. మొదట చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చి నమ్మించి, ఆ తర్వాత భారీగా ఇన్వెస్ట్ చేయించి ముంచేస్తారు. ఈ ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

Read Also:Annaram Barrage : అన్నారం బ్యారేజీకి ముప్పు పొంచి ఉందా..?

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మీ బ్యాంక్ ఖాతా, ఏటీఎం పిన్, ఓటిపి (OTP) లేదా చెక్ బుక్ ఎవరికీ ఇవ్వకండి. మీ ఖాతా ద్వారా జరిగే ప్రతి రూపాయి లావాదేవీకి మీరే బాధ్యులనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అతి తక్కువ కాలంలో డబ్బు రెట్టింపు అవుతుందన్నా లేదా లాటరీ వచ్చిందన్నా అది ఖచ్చితంగా మోసమే అని గుర్తించండి. సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తులకు మీ వ్యక్తిగత సమాచారాన్ని గానీ.. ఆర్థిక వివరాలను గానీ పంచుకోక పోవడమే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.

ఈ ఘటనలో.. కేవలం రూ.25 వేల కోసం ఆశపడిన ప్రదీప్ ఇప్పుడు వందల కోట్ల స్కామ్‌లో ఇరుక్కుపోయాడు. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో మనం చేసే చిన్న పొరపాటు జీవితకాలపు కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేస్తుంది. నేరగాళ్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వేళ మీరు సైబర్ మోసానికి గురైతే వెంటనే ‘1930’ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

Exit mobile version