ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి సమర్థించారు. ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారం’టూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను మరిచిపోకముందే.. రంజన్ చౌదరి ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. దేశంలో నీగ్రోలు ఉన్నారంటూ ఆయన పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా పిట్రోడా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నట్టు మాట్లాడారు. దీంతో కాంగ్రెస్ నాయకుల వైఖరిని సోషల్మీడియాలో పలువురు తప్పుబడుతున్నారు. కాగా లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేతల వ్యవహారశైలి, వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి కొత్త ఇబ్బందులు తీసుకొస్తున్నాయి.
READ MORE: CM YS Jagan: నేటి సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే..
అధిర్ రంజన్ ఏమన్నారంటే..పిట్రోడా జాతి వివక్ష వ్యాఖ్యలపై మీరేమంటారని జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ అధిర్ రంజన్ను అడిగింది. ఆయన స్పందిస్తూ.. ‘వ్యక్తిగత అభిప్రాయాల గురించి నేను మాట్లాడట్లేదు. అయితే, మన దేశంలో నెగ్రిటో క్లాస్ (నీగ్రోలు-ఆగ్నేయాసియాలోని నల్ల జాతీయుల తెగ), ప్రోటో ఆస్ట్రేలియన్, మంగోలియన్ తరగతి ప్రజలు ఉన్నారు. విశాలమైన భూభాగం కలిగిన మన దేశంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. దేశ ప్రజలందరూ ఒకే విధంగా ఉండరు కదా? కొందరు నల్లగా, మరికొందరు తెల్లగా ఉంటారు’ అని పేర్కొంటూ పరోక్షంగా పిట్రోడా వ్యాఖ్యలను సమర్థించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు దేశంలో దుమారం రేపుతున్నాయి. పిట్రోడా మాత్ర మే కాదు.. కాంగ్రెస్ నేతలంతా.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ మండిపడింది. అధిర్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ జాతీయ ప్రతినిధి షేహ్జాద్ పూనావాలా వారి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. కాగా.. దేశంలో ‘వారసత్వ పన్ను’ ఉండాలంటూ ఇటీవల దుమారంరేపిన కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా.. భారత్ను వైవిధ్య దేశంగా అభివర్ణించే క్రమంలో దక్షిణాది ప్రజలను ఆఫ్రికన్లతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.