కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను వివాదానికి దారితీశాయి. ఆయన నటించిన తాజా స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్ (Mr.X)’ ఏప్రిల్ 17న విడుదల కానున్న తరుణంలో, సినిమా ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వారణాసి సాధువుల గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ వ్యాఖ్యలు ఆధ్యాత్మిక వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
Also Read : Ramayana: ‘రామాయణ’కి జపాన్ ‘గాడ్జిల్లా’ షాక్.. ఐమ్యాక్స్ స్క్రీన్స్ కోసం భారీ యుద్ధం తప్పదా?
ఆర్య తన కెరీర్ ఆరంభంలో ‘నాన్ కడవుల్’ (తెలుగులో ‘నేను దేవుణ్ణి’) షూటింగ్ సమయంలో వారణాసిలో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అఘోరాలు మరియు సాధువుల జీవితాలను దగ్గరగా పరిశీలించానని చెబుతూ.. ‘వారణాసిలో ఉన్న సాధువులలో సుమారు 40 శాతం వరకు నకిలీవారు ఉండే అవకాశం ఉంది. కొందరు నేరస్థులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సాధువుల వేషంలో తిరుగుతున్నారని, వారికి ఎటువంటి ఐడీ కార్డులు ఉండవు. అంతేకాకుండా, కుంభమేళా సమయంలో జనసమూహంలో కొందరి వద్ద అధునాతన ఆయుధాలు కూడా ఉండవచ్చని పోలీసులు తనను హెచ్చరించారని ఆర్య వెల్లడించారు.
ఇక ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో హిందూ సంఘాలు, ఆధ్యాత్మిక వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారణాసి వంటి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని, అక్కడ నివసించే సాధువులను నేరస్థులతో పోల్చడం హిందూ ధర్మాన్ని కించపరచడమేనని వారు మండిపడుతున్నారు. మరోవైపు, ఆర్య అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన కేవలం తన వ్యక్తిగత అనుభవాలను, ఆ సమయంలో పోలీసులు చెప్పిన విషయాలను మాత్రమే పంచుకున్నారని, అందులో తప్పులేదని వాదిస్తున్నారు. దీంతో ‘మిస్టర్ ఎక్స్’ సినిమాపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ వివాదంపై ఆర్య ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ కొంత ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.
