చిన్నాచితక మహిళా వ్యాపారులే అతని టార్గెట్ !! ముద్ర లోన్స్ పేరుతో పరిచయం చేసుకుని.. మాయమాటలు చెప్పి.. నిండా ముంచుతున్నాడు. ఇలా మోసం చేసింది ఏ 10 మందినో.. వంద మందినో కాదు. ఏకంగా 500 మందిని మోసం చేశాడు. లక్షలు దండుకుని ఆస్తులు కూడగట్టుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. ఐదేళ్ల తర్వాత కానీ పోలీసులకు పట్టుబడలేదు. రోజుకో ప్రాంతంలో మారు వేషాల్లో తిరుగుతున్న ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. అమాయకంగా చేతులు కట్టుకుని నిల్చున్న ఇతగాడు… మామూలోడు కాదు. ఎలా మోసం చేయాలో యూట్యూబ్లో వీడియోలు చూసి నేర్చుకున్నాడు. ముద్ర లోన్స్ పేరుతో ఏకంగా 500 మంది మహిళలను మోసం చేశాడు. మాయమాటలు చెప్తూ.. ఏకంగా 3 కోట్ల రూపాయల వరకు దండుకుని పరార్ అయ్యాడు. పలు కేసుల్లో ఈ కేటుగాడి కోసం గాలిస్తున్న పోలీసులకు ఏకంగా 5 ఏళ్ల తర్వాత పట్టుబడ్డాడు.
Read Also: HYD Bava Murder: బావమర్దులు.. బావ బతుకు కోరతారు.. కానీ హైదరాబాద్లో ఓ బావ బలి కోరారు
ఇక, టైలరింగ్, లేడీస్ కార్నర్, బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్, బడ్డీ కొట్టు వంటి వ్యాపారాలు చేస్తున్న మహిళలను టార్గెట్ చేశాడు. కేంద్రం అందించే ముద్ర రుణాల పేరుతో ఎర వేసి… తన కమీషన్ ముందే చెల్లించాలని షరతు విధించి… అందినకాడికి దండుకుని పరారైన ఘరానా మోసగాడు షేక్ జానీని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. షేక్ జానీపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 7 కేసులు నమోదైనట్లు గుర్తించారు పోలీసులు. నిందితుడు షేక్ జానీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్గొండ జిల్లా నకిరేకల్కి చెందిన షేక్ జానీ… ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. బతుకుతెరువు కోసం 2011లో హైదరాబాద్ కి వలస వచ్చాడు. భార్య, పిల్లలతో కలిసి సరూర్నగర్లో ఉంటూ కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేశాడు. 2020లో కరోనా ఎఫెక్ట్తో ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డాడు. సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రుణాల వివరాల కోసం యూట్యూబ్లో సెర్చ్ చేశాడు. అందులో కేంద్రం అందించే ముద్ర రుణాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్నాడు. ఇక్కడే తెలివిగా ఆలోచించాడు. లోన్ కోసం ప్రయత్నించకుండా… ఎవరైతే ముద్ర రుణాల కోసం ప్రయత్నిస్తుంటారో… వారిని టార్గెట్ చేసుకుని మోసం చేయాలని ప్లాన్ చేశాడు.
Read Also: Juvenile Offenders Escape: వీరి వయసు 16 నుంచి 17 ఏళ్లు.. ఏకంగా జైలు నుంచే పరార్..
అయితే, చైతన్యపురి, సరూర్నగర్, దిల్ సుఖ్నగర్, వనస్థలిపురం, ఐఎస్ సదన్, అల్వాల్ సహా వివిధ ప్రాంతాల్లో సంచరించే షేక్ జానీ… చిన్నచిన్న క్లాత్ స్టోర్స్, బొటిక్స్, కుట్టు మిషిన్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు, లేడీస్ కార్నర్లను గుర్తిస్తాడు. ముఖ్యంగా మహిళలు నిర్వహించే వాటినే ఎంచుకుంటాడు. ఆ దుకాణాల బోర్డులపై ఉన్న యజమాని పేరు, ఫోన్ నెంబర్ తన లిస్ట్లో నమోదు చేసుకుంటాడు. మరుసటి రోజు ఈ నెంబర్లకు కాల్ చేసి.. తన పేరు హరినాథ్ అని, ముద్ర లోన్ ఏజెంట్ను అని నమ్మిస్తాడు. ఇంట్లో నుంచి ఉద్యోగం పేరుతో బయటకు వచ్చే షేక్ జానీ.. పార్కులు, నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లి తాను సేకరించిన మొబైల్ నెంబర్లకు ఫోన్ చేస్తుంటాడు. ముద్ర లోన్ ఏజెంట్ను మాట్లాడుతున్నాను అని.. మీకు లోన్ కావాలంటే చిటికెలో అరేంజ్ చేస్తాను అని నమ్మిస్తాడు. లక్ష రూపాయల లోన్కు కేవలం 2 వేలు కమీషన్గా ఇస్తే చాలు అంటాడు. మొబైల్ నంబర్ కూడా ఓ రిటైర్డ్ ఆర్మీ సైనికుడి అడ్రస్ ప్రూఫ్లతో దొంగతనంగా తీసుకున్నాడు. లోన్స్ కోసం కాల్ చేసిన మహిళల నుంచి… అన్ని రకాల డాక్యుమెంట్స్ వాట్సప్ చేయించుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత కాల్ చేసి.. మీకు 10 లక్షల లోన్ మంజూరు అయిందని.. ఐతే తన కమిషన్ మాత్రం ఇప్పుడే ఇవ్వాలని కోరతాడు. ఇలా ఒక్కో మహిళ నుంచి 10 వేలు, 20 వేల చొప్పున వసూలు చేస్తాడు. తర్వాత ఆ మహిళ నెంబర్ను బ్లాక్ లిస్ట్లో ఉంచుతాడు.
Read Also: Krishna Arrest: లైంగిక వేధింపుల కేసులో మరో డాన్స్ మాస్టర్.. విచారణలో సంచలన విషయాలు..
ఇక, బాధిత మహిళల నుంచి డబ్బులను నేరుగా బ్యాంక్ అకౌంట్ కి మళ్లించుకుంటే దొరికిపోతానని.. తెలివిగా ఆలోచించే వాడు. దీనికోసం మరో మాస్టర్ స్కెచ్ వేశాడు. ఏటీఎం సెంటర్ల వద్ద ఎవరైనా డబ్బులు డ్రా చేసేందుకు వస్తే వాళ్లను మాటల్లో పెట్టేవాడు. తన బంధువులు హాస్పిటల్లో ఉన్నారని.. అత్యవసరంగా డబ్బులు డ్రా చేద్దాం అంటే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయ్యిందని… మీ ఫోన్పే లేదా గూగుల్ పే చేయిస్తాను అని చెప్పేవాడు. ఎవరైనా ఒప్పుకుంటే… వెంటనే ఆ మహిళకు కాల్ చేసి తాను చెప్పిన నెంబర్ కు డబ్బులు యూపీఐ చేయించుకుంటాడు. వాళ్ల ఏటీఎం కార్డ్ ద్వారా విత్ డ్రా చేసుకుంటాడు.
Read Also: Russia: యూఎస్ బెదిరింపులు.. ఐఎన్ఎఫ్ ఒప్పందం నుంచి రష్యా ఔట్..
కాగా, ఇలా వారి బ్యాంక్ ఖాతా, వాలెట్స్ వివరాలను బాధితులకు ఫోన్ చేసి చెప్పి… వాటిలో డబ్బు డిపాజిట్ చేయించేవాడు. ఆ మొత్తాన్ని అక్కడిక్కడే డ్రా చేయించి తీసుకుని ఉడాయించే వాడు. డబ్బు చెల్లిస్తున్న సమయంలో 10 నిమిషాల్లో ముద్ర లోన్ డబ్బులు మీ అకౌంట్లో పడుతుందంటూ నమ్మిస్తాడు. డబ్బులు రాగానే.. సిమ్ పారేయడం లేదా వాళ్ల నెంబర్ను బ్లాక్ లిస్ట్లో ఉంచడం చేసేవాడు. ఇలా మూడు కమిషనరేట్ల పరిధిలో ఏకంగా 500 మంది మహిళల నుంచి 3 కోట్ల వరకు కాజేసినట్లు గుర్తించారు పోలీసులు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో షేక్ జానీ… రెండు కార్లు, బైక్తోపాటు.. రెండు ప్లాట్లు కొనుగోలు చేశాడు. ఐతే… షేక్ జానీ చేతిలో మోసపోయిన వాళ్లు చాలామంది ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేశారు. 10, 20 వేల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ ఏం తిరుగుతాంలే అనుకుంటారు బాధితులు. కానీ… భారీ మొత్తంలో కోల్పోయిన ఏడుగురు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. షేక్ జానీపై నమోదైన కేసులతో గాలించిన పోలీసులు.. ఏకంగా 5 ఏళ్ల తర్వాత పట్టుకున్నారు. రోజుకో ప్రాంతం చొప్పున రకరకాల మారువేషాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు పోలీసులు.