నక్సలిజాన్ని రూపుమాపేందుకు, మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది మావోలు భద్రతబలగాల ఎన్ కౌంటర్ లో మృతిచెందారు. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 40 మంది మావోయిస్టులు లొంగిపోయారు. డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలో మావోయిస్టులు కలిసిపోయారు.. లొంగిపోయిన వాళ్లలో ముగ్గురు రాష్ట్రస్థాయి లీడర్లు.. కొందరు హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఉన్నారు.
లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి, ఒడిశా, ఛత్తీస్గఢ్కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు, ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారు. మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్కు చెందినవారిగా డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. మావోయిస్టుల వద్ద నుంచి 24 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు సెంట్రల్ విజన్ కమాండర్లు ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు. తెలంగాణ పోలీసుల మేజర్ ఆపరేషన్ సక్సెస్ తో మావోయిస్ట్ పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగిలినట్లైంది.