1983 Cricket World Cup: “తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం”.. ప్రపంచకప్ విజయానికి 43 ఏళ్లు.!

1983 Cricket World Cup

1983 Cricket World Cup

1983 Cricket World Cup: భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిన 1983 ప్రపంచకప్ విజయానికి నేటితో 43 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆ చారిత్రక విజయాన్ని గుర్తుచేసుకుంటూ కపిల్ దేవ్ నేతృత్వంలోని జట్టుకు అభినందనలు తెలిపింది. “తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం” అంటూ బీసీసీఐ సోషల్ మీడియా వేదిక ప్రత్యేక సందేశాన్ని పంచుకుంది.

1983 జూన్ 25న లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్, అప్పటి రెండు సార్లు వరుసగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌ను ఎదుర్కొంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 183 పరుగులకే ఆలౌట్ అయింది. కృష్ణమాచారి శ్రీకాంత్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. వెస్టిండీస్ బౌలర్లలో ఆండీ రాబర్ట్స్ మూడు వికెట్లు సాధించగా.. మాల్కమ్ మార్షల్, మైఖేల్ హోల్డింగ్, లారీ గోమ్స్ చెరో రెండు వికెట్లు తీశారు.

అయితే భారత బౌలర్లు, ఫీల్డర్లు ఊహించని ఆట తీరుతో మ్యాచ్‌ను మలుపుతిప్పారు. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోతూ 140 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 43 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసి తొలి వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 26 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీసిన మొహిందర్ అమర్‌నాథ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచారు. ప్రపంచకప్ ట్రోఫీని లార్డ్స్ బాల్కనీలో కపిల్ దేవ్ “ప్రపంచకప్” ఎత్తిపట్టిన దృశ్యం భారత క్రీడా చరిత్రలో ఇప్పటికి చిరస్థాయిగా నిలిచిపోయింది.

1975, 1979 ప్రపంచకప్‌లలో గ్రూప్ దశనే దాటలేకపోయిన భారత్.. 1983 విజయంతో ప్రపంచ క్రికెట్‌లో శక్తివంతమైన జట్టుగా అవతరించింది. ఆ తర్వాత 2011లో ఎంఎస్ ధోని సారథ్యంలో మరోసారి ప్రపంచకప్ గెలిచిన టీమిండియా, 2023 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది. 2027లో తర్వాతి వరల్డ్ కప్ జరగనుంది.