Javed Akhtar: పాకిస్తాన్లో హిందూ మైనారిటీలను ఉద్దేశిస్తూ ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో జర్దారీ మాట్లాడుతూ.. పాక్ మొత్తం జనాభాలో హిందువులు 3-4శాతం ఉన్నారని, దేశంలోని ముస్లింలు వీరిని ‘‘సహిస్తున్నారు’’ అని అన్నారు. ఇదే కాకుండా భారతీయులపై నోరు పారేసుకున్నారు. భారతీయుల దృక్పథం వేరుగా ఉందని, వారికి తమదైన ఎజెండా ఉందని, వారు అఖండ భారత్ను విశ్వసిస్తున్నారని, కానీ మధ్యలో జరిగిన అనేక విసయాలను మర్చిపోయారని జర్దారీ అన్నారు. మేము ముస్లింలం, కానీ 3-4 శాతం హిందూ జనాభాను సహించే మానసికత మాకు ఉందని, వారు మాతో ఉండటానికి ఇష్టపడుతారని అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై సినీ గేయరచయిత జావేద్ అఖ్తర్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్లో జర్దారీకి ఉన్న ‘‘మిస్టర్ 10 పర్సెంటేజ్’’ అనే మారుపేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. జావేద్ అఖ్తర్ తన పోస్టులో.. “మిస్టర్ జర్దారీ.. తమ దేశంలో 3–4 శాతం హిందువులను సహిస్తున్నామని అంటున్నారు. 10 శాతం కంటే తక్కువ ఉన్న వారందరి పట్ల మీరు ఎప్పుడూ సున్నితత్వం లేకుండా వ్యవహరించారని అర్థమవుతోంది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
గతంలో కూడా జావేద్ అక్తర్ పాక్ తీరుపై బహిరంగంగా విమర్శలు చేశారు. 2025 మేలో ముంబైలో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన భారత్-పాకిస్థాన్ సంబంధాలపై మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని, ఉగ్రవాదులకు తన భూభాగాన్ని సురక్షిత స్థావరంగా ఉపయోగించుకునే అవకాశం ఇస్తోందని ఆరోపించారు.
మిస్టర్ 10% జర్దారీ:
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ గురించి సొంతదేశంలోనే ఒక విమర్శ ఉంది. అంతా అతడిని మిస్టర్ 10%గా పిలుస్తారు. ఏ పని చేయాలన్నా ఆయనకు 10 శాతం కమిషన్ ఇవ్వాల్సిందే అని అక్కడి వారు అనుకుంటారు. అంత అవీనితి చేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. భార్య బెనజీర్ భుట్టో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో 10% కమీషన్ తీసుకుంటారనే ఆరోపణలు రావడంతో ఈ పేరు బాగా పాతుకుపోయింది.

