Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

  • బెంగాల్‌లో సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ
  • పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
  • కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎం సువేందు
Suvendu Adhikari

Suvendu Adhikari

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆధ్వర్యంలో తొలి కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణం కోసం 45 రోజుల్లో బీఎస్‌ఎఫ్‌కు భూములు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రజాకేంద్రీకృత పరిపాలన, భద్రత, సుపరిపాలన లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు.

సోమవారం నబన్నలో మంత్రులతో సువేందు అధికారి తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాక.. సువేందు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బెంగాల్ చరిత్రలో తొలిసారి ఎలాంటి హింస, బెదిరింపులు లేకుండా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తామని, ఎన్నికల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఎప్పటికీ మర్చిపోమని తెలిపారు. వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నిర్ణయాలు ఇవే..
కేబినెట్ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణానికి 45 రోజుల్లో బీఎస్‌ఎఫ్‌కు భూముల బదిలీ, ఐఏఎస్, ఐపీఎస్, డబ్ల్యూబీపీఎస్ అధికారులపై రాష్ట్రం వెలుపల డిప్యూటేషన్, శిక్షణ కార్యక్రమాల పరిమితుల ఎత్తివేత, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అవకాశం కోల్పోయిన అభ్యర్థులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)ను తక్షణ అమలు చేయడం, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన వంటి కేంద్ర పథకాల అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

‘‘45 రోజుల్లో బీఎస్‌ఎఫ్‌కు భూములు అప్పగిస్తాం. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది” అని సీఎం సువేందు అధికారి వెల్లడించారు. రాష్ట్ర అధికారులకు బయటి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించడం ద్వారా పరిపాలనా సమన్వయం, సంస్థాగత అనుభవం పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ‘‘బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, ప్రజా అనుకూల పరిపాలన నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’’. అని సువేందు అధికారి స్పష్టం చేశారు.

మే 4న విడుదలైన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలు కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఇక గత శనివారం ముఖ్యమంత్రిగాసువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటుదిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, ఖుదిరామ్ టుడు, నిశిత్ ప్రమాణిక్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.