Caste Census: వచ్చే ఏడాది జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో ‘కులగణన’ అంశం కీలకంగా మారబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ దీనిపై స్పష్టంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడుతామంటూ ప్రకటించారు. మరోవైపు ప్రజలను కులాలు, మతాల పేరుతో కాంగ్రెస్ వేరు చేసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ మండిపడుతోంది. ఇదిలా ఉంటే కులగణనపై బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ స్పందించింది.
గురువారం రోజున ఆర్ఎస్ఎస్ కులగణనకు షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. శాస్త్రీయంగా, ఎన్నికల ప్రయోజనాల కోసం కాకండా నిర్వహించే ఏదైన నిశ్చయాత్మక చర్యను స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతల్లో ఒకరైన శ్రీధర్ గాడ్గే స్పందిస్తూ.. కులగణన కొంతమందికి రాజకీయ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని కారణంగా దానికి తన వ్యతిరేకత ప్రకటించానని, దాని వల్ల ఆచరణాత్మక ఉపయోగం లేదని అన్నారు.
Read Also: Jammu Kashmir: పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి.. ముగ్గురు జవాన్లు మృతి
కులగణనను సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించాలని మా అభిప్రాయమని, ఈ కసరత్తు చేస్తున్న సమయంలో సామాజిక సామరస్యం, ఐక్యత దెబ్బతినకుండా చూసుకోవాలని, ఆర్ఎస్ఎస్ కూడా హిందూ సమాజం కోసం పనిచేస్తుందని ఈ రోజు ప్రకటనలో వెల్లడించింది.
గత కొన్ని వారాలుగా దేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కులగణన అంశాన్ని తెరపైకి తెచ్చింది. కొన్ని రోజుల క్రితం బీహార్ రాష్ట్రం కులగణన నిర్వహించి, డేటాను కూడా విడుదల చేసింది. 65 శాతం రిజర్వేషన్లు పెంచాలని అక్కడి అసెంబ్లీలో బిల్లును కూడా ఆమోదించింది. ఇండియా కూటమి కూడా ఇదే విధంగా కులగణన నిర్వహించాలని బీజేపీని డిమాండ్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో కులగణన చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే కులగణన ప్రాతిపదికన కాంగ్రెస్ ప్రచారం చేసినప్పటికీ.. తెలంగాణ మినహా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోవడం గమనార్హం.