Delhi Elections 2025: కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన రాష్ట్రపతి సహా ప్రముఖులు వీరే!

  • ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికలు..
  • ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
  • ఓటేసిన సీఎం అతిషి, రాహుల్ గాంధీ, జైశంకర్, సిసోడియా, ఢిల్లీ గవర్నర్ వీగే సక్సేనా
Voting

Voting

Delhi Elections 2025: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ స్టార్ట్ కాగా.. తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఓటింగ్‌లో 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు ఓటు వేయనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ జరుగుతోంది. అన్ని స్థానాల్లో అధికార ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు. 30 వేల మంది పోలీసులు, 220 కంపెనీల పారామిలిటరీ బలగాలు, 3000 వేల హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉన్నారు.

Read Also: Arvind Kejriwal: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అధినేతపై కేసు.. ఎందుకంటే?

* దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
* కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ తరపున పోటీ చేస్తున్నా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
* భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌, ఆయన సతీమణి తుగ్లక్‌ క్రెసెంట్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు.
* కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి, ఆయన సతీమణి లక్ష్మీ పురి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆనంద్‌ నికేతన్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
* కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నిర్మాణ్‌ భవన్‌లో తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
* దివంగత నేత సుష్మాస్వరాజ్‌ కుమార్తె, బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్‌ జన్‌పథ్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.
* ఇండియన్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్ కె. త్రిపాఠీ కె.కమ్రాజ్‌ లేన్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
* ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తన సతీమణి సీమాతో కలిసి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
* ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా రాజ్‌ నివాస్‌ మార్గ్‌లో, సీఎం అతిషి కాల్‌కాజీలో ఓటు వేశారు.