Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ త్వరలో పాకిస్తాన్లో భాగం అవుతుందని ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ తమదే అని దయాది దేశం చెబుతుంటుంది. అయితే, నిజంగా జమ్మూ కాశ్మీర్, పీఓకేతో సహా ఎవరిదో అమెరికా స్పష్టం చేసింది. ఇప్పటికే భారత్-అమెరికా ట్రేడ్ డీల్తో ఇబ్బందులు పడుతున్న దాయాది దేశానికి, అమెరికా మరో షాక్ ఇచ్చినట్లైంది. పూర్తిగా జమ్మూ కాశ్మీర్ ఉన్న భారత మ్యాప్ను ప్రదర్శించింది.
Read Also: T20 World Cup: బాయ్కాట్ నిర్ణయంపై పాక్ టీం యూటర్న్..?
అమెరికా ట్రేడ్ రిప్రెజెంటేటివ్ (USTR) ఆఫీస్ విడుదల చేసిన ఇండియా మ్యాప్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్తో సహా మొత్తం జమ్మూ కాశ్మీర్ను భారత దేశంలో అంతర్భాగంగా చూపించింది. అమెరికా ప్రభుత్వ అధికారిక పత్రంలోనే ఇలాంటి మ్యాప్ రావడం, పాకిస్తాన్ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. దీంతో, పీఓకే కూడా భారత్లో అంతర్భాగమనే అమెరికా ఒప్పుకున్నట్లైంది.
నిజానికి, ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఆయనను అనేక విధాలుగా ప్రభావం చేయడానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లు ప్రయత్నించారు. రంగురాళ్లను ఒక సూట్కేస్లో పెట్టుకుని ట్రంప్కు చూపించి ‘‘రేర్ ఎర్త్ డీల్’’ కుదుర్చుకోవడానికి ప్రయత్నించారు. చివరకు అసలు ఎవరు తమకు మెరుగైన భాగస్వామి అనే ప్రశ్నకు అమెరికా ‘‘భారత్-యూఎస్ ట్రేడ్ డీల్’’తో సమాధానం ఇచ్చినట్లైంది.
