Uddhav Thackeray: శివసేన మరోసారి చీలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఎంపీలు బిగ్ షాక్ ఇచ్చారు. 9 మంది ఎంపీల్లో ఆరుగురు తిరుగుబాటు చేశారు. ఉద్ధవ్ వర్గాన్ని వీడి, వీరంతా అసలైన శివసేన ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు సిద్ధమయ్యారు. తమను ఒక ప్రత్యేక బృందంగా పరిగణించాలని కోరుతూ ఆరుగురు ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో ఉద్ధవ్ ఎంపీలు సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, నగేష్ పాటిల్ అస్తికర్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహెబ్ వాక్చౌరే, సంజయ్ దిన పాటిల్ ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉద్ధవ్ వర్గంలో ఉన్నారు.
ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు బుధవారం నాందేడ్, పూణే, ముంబైల నుంచి ప్రైవేట్ విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వీరితో పాటు ఏక్నాథ్ షిండే శివసేనకు చెందిన ఒక సీనియర్ నాయకుడు కూడా ఢిల్లీకి వచ్చి, స్పీకర్కు మద్దతు లేఖను సమర్పించారు. తిరుగుబాటు ఊహాగానాల నేపథ్యంలో, ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ సంజయ్ రౌత్ ఢిల్లీ నివాసంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శివసేన(యూబీటికి) చెందిన ఎంపీలు అవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజభౌ ఉన్నారు.
మా ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రే నేత నేతృత్వంలోని శివసేన కాగడా గుర్తపై ఎన్నికయ్యారుని, వారు ప్రధాని మోడీ పేరు మీద గెలవలేదని, ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారిని వదిలిపెట్టేది లేదని సంజయ్ రౌత్ హెచ్చరించారు. వెళ్లాలనుకునే వారు రాజీనామా చేసి వెళ్లవచ్చని అన్నారు. మరోవైపు, ఈ తిరుగుబాటుపై ఎంపీలపై విలేకరుల సమావేశంలోనే రౌత్ బూతుల వర్షం కురిపించడం వివాదంగా మారింది.

