HMPV Virus: చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తొలి కేసులు నమోదు కాగా, తాజాగా మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. అయితే, మహారాష్ట్రలోని నాగ్పుర్లో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణ అయింది. 7, 14 ఏళ్ల చిన్నారులు ఇద్దరూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో భారత్లో ఇప్పటి వరకు 7 హెచ్ఎంపీవీ కేసులు నమోదు అయ్యాయి. సోమవారం నాడు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లలో తొలి కేసులు రికార్డు అయ్యాయి. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర సర్కార్ భరోసా కల్పిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సైతం తెలిపారు.
Read Also: AlluArjun : అల్లు అర్జున్ ను అనుమతించని పోలీసులు
ఇక, హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య రంగ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ వైరస్ చాలా ఏళ్లుగా వ్యాప్తిలో ఉందంటున్నారు. గాలి, శ్వాసప్రక్రియ ద్వారా ఇది సోకుతుందన్నారు. అన్ని వయసుల వారిని ఈ వైరస్ ప్రభావితం చేస్తోందని తెలిపారు. ఆరోగ్యమంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, ఎన్సీడీసీ చైనాతో పాటు పొరుగు దేశాల్లో పరిస్థితిని గమనిస్తున్నాయి. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఆరోగ్యపరమైన సవాళ్లపై తక్షణం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు.